సత్తుపల్లి: సైలో బంకర్తో స్థానికులకు ఎదురవుతున్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నందున దీక్షలు విరమిస్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని కిష్టారం అంబేద్కర్నగర్లో సైలో బంకర్కు వ్యతిరేకంగా 30రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్థానికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సింగరేణి సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సైలోబంకర్ సమస్యను ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించారరని తెలిపారు. ప్రజల ఆవేదనపై ప్రభుత్వంతోనైనా గట్టిగా చర్చించనున్నందున తమపై నమ్మకంతో దీక్షలు విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సైతం సైలో బంకర్ బాధితులు కలిశారు. సమస్యపై సింగరేణి సీఎండీతో కలిసి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం మాట్లాడతామని, అయినా ఫలితం లేకపోతే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈమేరకు దీక్షలను విరమించాలని ఆయన సూచించగా, చర్చించుకుని శనివారం చెబుతామని అటు సింగరేణి డైరెక్టర్, ఇటు మంత్రికి అంబేద్కర్నగర్ కాలనీవాసులు బదులిచ్చారు.
సైలోబంకర్ బాధితులతో సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు