ఖమ్మం రాపర్తినగర్: వికసిత్ భారత్ ద్వారా నిర్వహించే యువ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు ఎన్వైకే జిల్లా అధికారి ప్రవీణ్ఉకమార్ సింగ్, ఎన్ఎస్ఎస్ పీఓ శ్రీనివాస్, అర్గనైజింగ్ కమిటీ నిర్వాహకులు డాక్టర్ కే.వీ.రమణరావు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూపొందించిన ఒక్క నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ పోటీలు 19వ తేదీన ఖమ్మంలోని కవిత మెమోరియాల్ డిగ్రీ కళాశాలలో జరుగుతాయని తెలిపారు.
మందులు, సామగ్రి
సరఫరాకు టెండర్లు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అవసరమైన మందులు, ఇతర సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎల్.కిరణ్కుమార్ తెలిపారు. మందులతో పాటు శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి, ప్రయోగశాలలో రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాథల్యాబ్ ఇంప్లాంట్లను రెండేళ్ల పాటు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏజెన్సీలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ పేరుతో రూ.10వేల డీడీ లేదా చెక్కు అందజేసి ఈనెల 20 టెండర్ దరఖాస్తు తీసుకోవచ్చని, పూర్తిచేశాక ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5గంట ల్లోగా అందజేయాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
ఖమ్మంఅర్బన్/ముదిగొండ: రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటున్న జిల్లా జట్టులో ఖమ్మం మల్లెమడుగు, ముదిగొండ మండలం మేడేపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు స్థానం దక్కింది. మల్లెమడుగు పాఠశాల విద్యార్థులు శ్రీవాణి, పల్లవి, జానీ, మోహనకృష్ణతో పాటు మేడపల్లి జెడ్పీహెచ్ఎస్ నుంచి కీర్తి, మణిదీప్చంద్ర, తనుశ్రీ, ధోని ఎంపికయ్యారు. వనపర్తిలో మంగళవారం మొదలుకానున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వీరు బయలుదేరారు. ఈ సందర్భంగా విద్యార్థులను హెచ్ంఎలు కృష్ణవేణి, బి.నాగేశ్వరరావు, అమ్మ ఆదర్శ పాఠశాలల అధ్యక్షులు ఝూన్సీ, అలివేలి, ఝాన్సీ, కార్పొరేటర్లు లలితారాణి, నిరంజన్, పీడీ బి.కృష్ణయ్యతో పాటు కృష్ణమూర్తి, సూర్యం, కృష్ణ, తిరుపతిరావు, శ్రీనివాసరావు, జానీమియా, వెంకటేశ్వర్లు, బట్టపోతుల సతీష్, వైకుంఠాచారి తదితరులు అభినందించారు.
భూనిర్వాసితులకు
ఇళ్ల పట్టాలు
ఖమ్మం మయూరిసెంటర్: కేఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, విస్తరణకు ఇళ్లు, ఇంటి స్థలాలు సేకరించారు. ఈమేరకు నిర్వాసితులు ఐదుగురికి మేయర్ పి.నీరజ గురువారం ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కేఎంసీ అధికారులు పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో
ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో సదరు వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మద్యపాన నిషేధ, ఆబ్కారీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రాళ్లబండి శాంతిలత గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్కు చెందిన బి.వెంకటేశ్వరరావు వద్ద ఖమ్మంకే చెందిన కె.గోపీ రవీంద్రనాధ్ కుమార్ 2016 మే నెలలో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. అనంతరం అప్పు చెల్లించే సమయంలో జారీ చేసిన చెక్కును బ్యాంకు జమచేస్తే సరిపడా నగదు లేక బౌన్స్ అయింది. ఈమేరకు న్యాయవాది చుంచుల మల్లికార్జునరావు ద్వారా వెంకటేశ్వరరావు కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం రవీంద్రనాధ్ కుమార్కు ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.2లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు.
రోడ్డు ప్రమాదం కేసులో...
ఖమ్మం లీగల్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు ప్రధమ శ్రేణి న్యాయస్థానం న్యాయమూర్తి బెక్కం రజిని గురువారం తీర్పు వెల్లడించారు. 2021 జనవరి 9న ఖమ్మం చైతన్యనగర్లో నడిచి వెళ్తున్న పోలూరి శ్రీనివాసరావును పావురాల వెంకటనారాయణ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు విచారణ అనంతరం చార్జీషీట్ దాఖలు చేశారు. ఈమేరకు వెంకటనారాయణపై నేరం రుజువు కావడంతో మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పిటీషనర్ తరపున ఏపీపీ డి.వీరయ్య వాదించగా, కానిస్టేబుల్ మత్తయ్య సహకరించారు.
‘వికసిత్ భారత్’ గడువు పొడిగింపు