
చేతికి రాగానే కొనుగోళ్లు !
సిద్ధంగా 19.39లక్షల
గన్నీబ్యాగ్లు
ధాన్యం కొనుగోళ్లకు 64.62 లక్షల గన్నీ బ్యాగ్ల అవసరముండగా, ప్రస్తుతం 19.39 లక్షల బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా 45.23 లక్షల బ్యాగ్లను ఈ నెలాఖరు నాటికి సమకూర్చుకుంటారు. ఇందులో 20.74 లక్షల సంచులు కొత్తవి, మిగతావి ఉపయోగించినవి సిద్ధం చేస్తారు. కొనుగోళ్ల ఆధారంగా గన్నీల కొరత రాకుండా కేంద్రాలకు సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
కొనుగోళ్ల వివరాలు..
ధాన్యం (అంచనా) 25,84,928 క్వింటాళ్లు
సన్న రకం 18,53,370 క్వింటాళ్లు
దొడ్డు రకం 7,31,558 క్వింటాళ్లు
కేంద్రాలు 344
అవసరమైన గన్నీ బ్యాగ్లు 64.62 లక్షలు
అందుబాటులో ఉన్నవి 19.39 లక్షలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈ యాసంగి రైతులు సాగు చేస్తున్న ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల 1నుంచి జిల్లాలో కొనుగోళ్లు మొదలుకానుండగా 344 కేంద్రాల ద్వారా 25,84,928 క్వింటాళ్ల సేకరణను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు, 7,31,558 క్వింటాళ్లు దొడ్డు రకం ఉన్నాయి. కేంద్రాలకు కావాల్సిన గన్నీ సంచులు సమకూరుస్తూనే, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు సిద్ధం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్లో ఉన్న జిల్లాలో ఈ నెలాఖరు నాటికే వరి కోతలు మొదలుకానున్నాయి. దీంతో వచ్చే నెల మొదటి వారం నుంచి కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
2.10లక్షల ఎకరాల్లో వరి సాగు
జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టుతో బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల కింద 2,10,830 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్న రకం 1,29,064 ఎకరాలు, దొడ్డు రకం 81,766 ఎకరాలు ఉన్నాయి. సన్నరకాలు క్వింటాకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ ఎక్కువగా సన్న రకాలే సాగు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం సాగుతో అంతా కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు, రైతులు అవసరాల కోసం పోగా మిగిలిన ధాన్యం కొనేలా పౌర సరఫరాల సంస్థ కసరత్తు చేస్తోంది. ఈమేరకు 25,84,928 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని భావిస్తుండగా, ఇందులో సన్నరకాల కోసమే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటుచేసే అవకాశముంది.
పీఏసీఎస్ కేంద్రాలే ఎక్కువ
జిల్లాలో మొత్తం 344 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ఇందులో సన్న రకాల కోసం 282, దొడ్డు రకాల కోసం 62 కేంద్రాలు ఉంటాయి. వీటిలో ఐకేపీ 151, పీఏసీఎస్లు 162, డీసీఎంఎస్ 28, మెప్మా ఆధ్వర్యంలో మూడు కేంద్రాలను తెరుస్తారు. కాగా, ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసే వాటిలో 60 కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లే ఉంటాయి. కాగా, వచ్చే నెల 1 నుంచి జూన్ వరకు ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఉంటాయి.. ఎక్కడ కోతలు మొదలైతే అక్కడ తొలుత కొనుగోళ్లు ప్రారంభించేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో ఏర్పాటుచేసిన కేంద్రాల స్థానంలో ఈసారి కూడా ఉంటాయని తెలిపారు.
వచ్చే నెల 1నుంచి
యాసంగి ధాన్యం సేకరణ
344 కేంద్రాల ద్వారా 25.84 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు అంచనా
ఇందులో సన్నరకాలే..
18.53లక్షల క్వింటాళ్లు
ఏర్పాట్లలో నిమగ్నమైన
పౌరసరఫరాల సంస్థ
ఏర్పాట్లు చేస్తున్నాం ..
జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. ఇటీవల హైదరాబాద్లో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. వచ్చే నెల 1నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. ఏదైనా ప్రాంతంలో అంతకన్నా ముందే ధాన్యం వచ్చినా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొనుగోళ్లు చేపడతాం.
– చందన్కుమార్, డీఎస్ఓ

చేతికి రాగానే కొనుగోళ్లు !