ఖమ్మంఅర్బన్: పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 10వ డివిజన్ చైతన్యనగర్లో అమృత్ –2లో భాగంగా రూ.249 కోట్లతో చేపడుతున్న మురుగు నీటి పైపులైన్, అండర్గ్రౌండ్ డ్రైయిన్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డ్రైయిన్ల నిర్మాణంలో పేదల స్థలాలు ఏమైనా కోల్పోయినా వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కాగా పనులు చేపట్టాలన్నారు. గతంలో వచ్చిన పరిస్థితి మరోసారి ఖమ్మం నగరానికి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్యాయపరంగా తొలగించాలని మంత్రి మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పేదలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందించాలని కలెక్టర్కు సూచించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో వచ్చే మార్పులపై మనం కూడా దృష్టి పెట్టాలని, రెండేళ్ల క్రితం దేశంలో పట్టణీకరణ కారణంగా అర్బన్ జనాభా పెరిగిందని అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలపాలన్నారు. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉందని, ఖమ్మం లాంటి చిన్న నగరానికి కూడా ఇది వచ్చిందంటే మంత్రి తుమ్మల కృషే కారణమని అన్నారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా ఉన్నట్టుగానే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం కూడా నగరంలో రాబోతోందని, తద్వారా దేశంలో పెద్ద నగరాలతో పాటు ఖమ్మం నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్డీఓ నరసింహారావు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్లు చావా మాధురి నారాయణరావు, సరిపూడి రమాసతీష్, లకావత్ సైదులు, నిరీషారెడ్డి, రావూరి కరుణసైదబాబు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, హుస్సేన్, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, తహసీల్దార్ రవి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు సాధు రమేష్రెడ్డి పాల్గొన్నారు.
ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధికి చర్యలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
మురుగు నీటి పైప్లైన్ నిర్మాణ పనుల శంకుస్థాపన