తేజా @ ఖమ్మం | - | Sakshi
Sakshi News home page

తేజా @ ఖమ్మం

Mar 13 2025 12:38 AM | Updated on Mar 13 2025 12:37 AM

మార్కెట్‌లో పెరిగిన మిర్చి విక్రయాలు
● విదేశీ ఎగుమతులకు అడ్డాగా ఖమ్మం ● తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న తేజా మిర్చి ● గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన విక్రయాలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

ఖమ్మంవ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, వరంగల్‌, ఖమ్మం మార్కెట్లలో మిర్చి విక్రయం ఎక్కువగా ఉంటుంది. అయితే కాలక్రమంలో ఖమ్మం మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతంలో తేజా మిర్చి సాగు అధికంగా ఉండడం, ఈ మిర్చికి విదేశాల్లో డిమాండ్‌ ఉండడంతో ఎగుమతిదారులు ఈ రకం మిర్చి కొనుగోళ్లకు ఖమ్మం మార్కెట్‌ను ఎంచుకున్నారు. తేజా మిర్చి, మిర్చి ఆయిల్‌ చైనా, మలేషియా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. విదేశీ ఎగుమతులు పెరుగుతుండగా రైతులు ఈ పంట సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇతర జిల్లాల్లోనూ..

రాష్ట్రంలో తేజా మిర్చి సాగు పెరుగుతోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2.50లక్షల ఎకరాల్లో ఈ రకం మిర్చి సాగు చేశారు. గతంలో ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేజా మిర్చి సాగు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జిల్లాలతో పాటు నల్లగొండ, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లోనూ తేజా మిర్చి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఒక్క ఖమ్మం జిల్లాలోనే 60 వేలకు పైగా ఎకరాల్లో మిర్చి సాగు చేయడం గమనార్హం.

ఖమ్మం కేంద్రంగా ధర నిర్ణయం..

గతేడాది తేజా రకం మిర్చి క్వింటా రూ. 20 వేల నుంచి రూ. 23వేల వరకు ధర పలికింది. దీంతో వివిధ ప్రాంతాల రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపారు. అయితే ఈ ఏడాది చైనాలో తేజా మిర్చి ఉత్పత్తి పెరిగింది. ఈ ప్రభావం ఇక్కడ మిర్చి ధరపై పడింది. ఇప్పుడు చైనా నుంచి ఆశించిన ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతిదారులు కొనుగోళ్లు తగ్గించడంతో పాటు కొనుగోలు చేసేవారు సైతం తక్కువ ధర పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం మిర్చి ధర గరిష్టంగా రూ.14 వేలు ఉండగా, మోడల్‌ ధర రూ.13,500 ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పండించిన ప్రాంతాల్లో అక్కడి వ్యాపారులు ఖమ్మం మార్కెట్‌ ఆధారంగా రూ.12వేల నుంచి రూ. 12,500 ధరతో కొనుగోలు చేస్తున్నారు.

జనవరి నుంచి మార్చి 11 వరకు ఖమ్మం మార్కెట్‌కు మిర్చి బస్తాల వివరాలు

నెల 2024 2025

జనవరి 4,32,362 3,81,442

ఫిబ్రవరి 8,57,438 9,61,737

మార్చి 1,81,248 5,10,995

మొత్తం 14,71,048 18,54,174

పోటెత్తుతున్న మిర్చి..

తేజా రకం మిర్చికి ఖమ్మం మార్కెట్‌ అడ్డాగా మారడం, విదేశీ ఎగుమతిదారులు ఈ మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పంట సాగు చేసిన రైతులు ఇక్కడ విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఈ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. దీంతో ఖమ్మంలో మిర్చి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా రెండో కోత తర్వాత ఇక్కడ విక్రయాలు మరింతగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 11 వరకు 3.80 లక్షల మిర్చి బస్తాలు అధికంగా విక్రయానికి వచ్చాయి.

తేజా @ ఖమ్మం1
1/1

తేజా @ ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement