సీతారామ ఎత్తిపోతల పథకం పేరు మార్పు యోచన?
● ఇందిరా/రాజీవ్ పేరు పెట్టాలని కాంగ్రెస్ ముఖ్యనేతల చర్చ ● వైఎస్ హయాంలో రాజీవ్, ఇందిరాసాగర్లు ప్రారంభం ● తెలంగాణ వచ్చాక సీతారామగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం
పేరుపై చర్చ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ పేర్లతో చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందనే అభిప్రాయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్కు అనుమతులు సాధించడం మొదలు భారీ స్థాయిలో నిధులు సైతం తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందున, సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్ట్కు గతంలో ఉన్న ఇందిరాసాగర్ లేదా రాజీవ్సాగర్ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎలా ఉంటుందనే చర్చ ఇటీవల ముఖ్యనేతల మధ్య జరిగినట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా రాజీవ్ సాగర్ ఉండగా, కొత్తగా వేలేరుపాడు మండలం రుద్రంకోట కేంద్రంగా ఇందిరాసాగర్ నిర్మించేలా డిజైన్ చేశారు. వీటికి సంబంధించి కొంతమేర పనులు చేపట్టాక రాష్ట్ర విభజన జరిగింది. దీంతో ఇందిరాసాగర్ ప్రాంతం పూర్తిగా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లను రద్దు చేస్తూ కొత్తగా సీతారామ బహుళార్థక సాధక ఎత్తిపోతల పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తొమ్మిదేళ్లుగా...
సీతారామ ప్రాజెక్ట్ పనులు 2016లో మొదలైతే తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటివరకు పూర్తికాలేదు. 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నపళంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు రాజీవ్ సాగర్ లింక్ కెనాల్ను ప్రతిపాదించింది. ఏడాది కాలంలో ఈ కాలువ పనులు పూర్తి చేశారు. దీంతో తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు ఈ నెల 5న గోదావరి జలాలను తరలించారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంచనా వ్యయాన్ని రూ.19 వేల కోట్లకు సవరించాల్సి వచ్చింది.
ఫాయిదా వచ్చేనా ?
ఉమ్మడి ఖమ్మం జిల్లా అనాదిగా భద్రాచల సీతారాముల పేరుతోనే ప్రసిద్ధి పొందింది. తానీషా కాలం నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకు సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సీతారామ పేరు ఈ జిల్లాకు సెంటిమెంట్తో ముడిపడిన అంశంగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు పేరులో మార్పులు చేస్తే ఫలితాలు ఎంత మేరకు సానుకూలంగా ఉంటాయనే అనుమానాలు కూడా అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
రాజీవ్ కెనాల్ తరహాలో
సీతారామ ప్రాజెక్టు స్వరూప స్వభావాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లింక్ కెనాల్ను తెర మీదకు తెచ్చింది. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ అని పేరు పెట్టగా, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వచ్చాయి. ఇదే తరహాలో సీతారామ పేరు మార్చకుండా భవిష్యత్లో ఈ ప్రాజెక్ట్కు అనుబంధంగా చేపట్టబోయే ఇల్లెందు నియోజకవర్గ మాస్టర్ ప్లాన్కు రాజీవ్/ఇందిరా సాగర్ల పేరును పరిశీలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు ఇంజనీరింగ్ వర్గాల నుంచి వస్తున్నాయి. పైగా సీతారామకు సంబంధించిన తొలి శంకుస్థాపన సైతం ఇల్లెందు నియోజకర్గంలోనే జరిగింది. కానీ తర్వాత మార్పుల్లో ఈ నియోజకవర్గాన్ని సీతారామ లబ్ధిదారుల జాబితా నుంచి దాదాపుగా మినహాయించారు.
అనుబంధ పనులు
ప్రస్తుతం సీతారామలో ఎక్కడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేదు. రోళ్లపాడు దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించే అంశంపైనా ప్రస్తుత ప్రభుత్వం చర్చ చేసింది. దీంతోపాటు సీతారామ ద్వారా నీరు అందని భద్రాచలం, తక్కువ ప్రయోజనం పొందే పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల కోసం కొత్తగా ఎత్తిపోతలు చేపట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. సీతారామకు అనుబంధంగా చేపట్టబోయే పనులు అనేకం ఉన్నందున, వాటికి కొత్తగా పేర్లు పెట్టడం ద్వారా స్వామికార్యం, స్వకార్యం రెండూ జరిగిపోతాయనే చర్చ హస్తం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.