స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు

Mar 12 2025 8:09 AM | Updated on Mar 12 2025 8:03 AM

భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్‌ స్కూళ్లతో పాటు హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్‌ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్‌ స్కూల్‌లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్‌ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు.

కొనసాగుతున్న

ఇంటర్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా, 19,835మంది విద్యార్థుల్లో 19,104మంది హాజరు కాగా 731మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, హెచ్‌పీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో పాటు తాను 46 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించారు.

14 నుంచి ఖమ్మం

మార్కెట్‌కు సెలవులు

ఖమ్మంవ్యవసాయం: హోలీ, వారాంతం నేపథ్యాన ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 14న శుక్రవారం హోలీ, 15న శనివారం వారాంతపు సెలవు, 16న ఆదివారం సాధారణ సెలవు ఉంటాయని, 17న సోమవారం మార్కెట్‌లో కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులు గమనించాలని కోరారు.

ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్‌ నోటీస్‌

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టరేట్‌లో క్లీనింగ్‌ కాంట్రాక్టు దక్కించుకుని కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ బాధ్యులకు అధికా రులు మంగళవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అంశంపై ‘సాక్షి’లో మంగళవారం ‘కార్మికుల కష్టం కాజేస్తున్నారు’ శీర్షికన కథనంప్రచురితమైంది. దీంతో ఏజెన్సీకి నోటీస్‌ జారీ చేసినట్లు కలెక్టరేట్‌ ఏఓ అరుణ తెలిపారు. ఈ నోటీసుకు అందే వివరణ ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

గృహ నిర్మాణ పనుల పరిశీలన

మధిర: మండలంలోని చిలుకూరును ఇందిరమ్మ ఇళ్లకు పైలట్‌ గ్రామంగా ఎంపిక చేయగా 37మంది లబ్ధిదారులు నిర్మాణాలను మొదలుపెట్టారు. ఈమేరకు పనులను మంగళవారం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నమూనా, ఇప్పటివరకు అయిన వ్యయం తెలుసుకున్నారు. దశల వారీగా బిల్లులు మంజూరు కానున్నందున, నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్రీనివాసరావు, గ్రామకార్యదర్శి మరీదు కొండలరావు, నాయకులు నిడమానూరు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూళ్లలో  ప్రవేశానికి దరఖాస్తులు1
1/1

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement