● రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి ● ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సులో డీఆర్ రవీందర్
ఖమ్మంమయూరిసెంటర్: 2020 ఏడాదికి ముందు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి నుంచి నిర్ణీత రుసుము కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) ఎం.రవీందర్ తెలిపారు. ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో సోమవారం రియల్ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ను రిజిస్ట్రేషన్ శాఖకు ఇటీవల ప్రభుత్వం లింక్ చేసిందని తెలిపారు. వెంచర్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తయి, మిగిలిన వాటికి ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసి ఉంటే ఫీజులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఈమేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడమే కాక ఫీజు చెల్లించి, అండర్ టేకింగ్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అంతేకాక 2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోలేకపోయినా వారి స్థలా లకు అన్నీ సక్రమంగా ఉంటే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. తద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. కాగా, కేఎంసీలో జరిగిన సమావేశంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల కోసం కార్యాలయంలో ఎనిమిదింటితో పాటు పన్నుల వసూళ్ల కేంద్రాల్లోనూ హెల్ప్డెస్క్లు ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తం చేసిన అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట, సబ్ రిజిస్ట్రార్ టి.సంపత్కుమార్, జాయింట్ రిజిస్ట్రార్ ఎస్.రమా కిషోర్రెడ్డి, కేఎంసీ టౌన్ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.