
ప్రసంగిస్తున్న సినీనటుడు తనికెళ్ల భరణి
సత్తుపల్లిటౌన్: భవిష్యత్ తరాలు అద్భుతంగా ఉండాలంటే భక్తిభావం, సంస్కారం పెంపొందించాలని ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. సత్తుపల్లిలోని శ్రీగణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన మనగుడి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సకలజన కార్తీక వనసమారాధనలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్యం నుంచే ఆలయాలను సందర్శించే విధంగా ప్రోత్సహించాలన్నారు. అసాధ్యమైనది ప్రపంచంలో ఏదీ లేదని, పట్టుదలతో సాధించవచ్చన్నారు. జీవితంలో ప్రశాంతత ఇచ్చేవి కళలేనని, పిల్లల్లో ఆసక్తి ఉన్న క్రీడలు, కళలను ప్రోత్సహించాలని సూచించారు. పలు భక్తి పాటలు పాడి గణపతి విశిష్టత, శివతత్వాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం సకలజనుల వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు బాలాజీ, కూసంపూడి శ్రీనివాసరావు, నాయుడు వెంకటేశ్వరరావు, లక్కినేని ప్రసాద్, గాదిరెడ్డి రాంబాబురెడ్డి, దారా ఏకాదశ మూర్తి, రాజు, రామకృష్ణ, ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, బాబురావు, లింగారెడ్డి, రాజరత్నాచారి, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి