
చికిత్స పొందుతున్న లక్ష్మి
రఘునాథపాలెం: మండలంలోని కోయచెలకకు చెందిన పెయింటింగ్ కార్మికుడు ఎం.రాంబాబు (23) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాయంత్రం వరకు గ్రామంలో మిత్రులతో గడిపిన యువకుడు తర్వాత ఉరి వేసుకున్నాడు. రాంబాబుకు ఇటీవలే సమీప బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని, పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రులు సైదమ్మ, శేషయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఏన్కూరు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సోలం రాజేశ్వరి (22) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆదివారం మృతురాలి భర్త రాంబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని వీయంబంజర్ రింగ్ సెంటర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాతకారాయిగూడెం తండాకు చెందిన అద్దంకి లక్ష్మి వీయంబంజర్ రింగ్ సెంటర్ సమీపంలో సత్తుపల్లి వైపు వెళ్లే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా క్రేన్ వాహనం ఢీ కొట్టింది. దీంతో లక్ష్మీ కిందపడిపోగా ఆమె పాదాలపై వాహనం టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, లక్ష్మి చిత్తుకాగితాలు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తోంది. ప్రమాదంలో రెండు పాదాలకు గాయాలు కావడంతో జీవనం సాగించడం ఇబ్బందిగా మారింది.
వృద్ధురాలి ఆత్మహత్య
చింతకాని: మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన తాతా కమలమ్మ (82) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మతిస్థిమితం కోల్పోయిన కమలమ్మ ఉదయం గడ్డి మందు తాగింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కోడలు భవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి
పాల్వంచ: అడవి నుంచి రోడ్డుపైకి వచ్చిన దుప్పిని గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొట్టడంతో ఆదివారం మృతి చెందింది. ఫారెస్ట్రేంజర్ ఆఫీసర్ ఎం.అనిల్కుమార్ కథనం ప్రకారం.. నవభారత్ కలెక్టరేట్ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి బీసీఎం జాతీయ రహదారిపైకి వచ్చిన దుప్పిని పాల్వంచ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో దుప్పి అక్కడిక్కడే మృతి చెందగా.. స్థానికుల అందించిన సమాచారంతో ఫారెస్ట్ రేంజర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి దుప్పికి పోస్ట్మార్టం నిర్వహించి కననం చేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాంబాబు (ఫైల్)