
సీనియర్ సివిల్ జడ్జి జావేద్పాషా
ఖమం లీగల్ : స్వేచ్ఛతో కూడిన గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపడం మానవ హక్కుల్లో భాగమని ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం దానవాయిగూడెంలోని జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేరారోపణపై జైలులో ఉన్న విచారణ ముద్దాయిలకు స్వేచ్ఛ లేనప్పటికీ గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందని అన్నారు. నేరం చేయడంతో పాటు చేస్తున్న వారి పక్కన ఉండటం కూడా నేరమేనని అన్నారు. నేరారోపణపై అరెస్ట్ అయిన వారు 18 ఏళ్ల లోపు వారైతే ఆ విషయాన్ని ప్రాథమిక దశలోనే పోలీసులకు లేదా కోర్టుకు తెలియపరచాలని సూచించారు. విచారణ ముద్దాయిలు న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేకుంటే న్యాయ సేవా సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో జైలు అధికారులు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి
ఖమ్మం సహకారనగర్ : వీఆర్వో వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సర్వీస్ నిబందనలకు విరుద్ధంగా డ్రా పద్ధతిన ఇతర శాఖలకు సర్దుబాటు చేయడంతో ఉద్యోగుల హక్కులకు భంగం కలిగినట్లయిందని అన్నారు. వీఆర్వోలందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకుని సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్తో పాటు పదోన్నతులు కల్పించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాలకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వంలో అయినా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు వీఆర్వోలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు హరారే సుధాకర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగుల్మీరా, చీమల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
1.14 లక్షల మంది
మహిళల ప్రయాణం
ఖమ్మంమామిళ్లగూడెం : మహాలక్ష్మి పథకాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించగా ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో ఆదివారం వరకు 1.14 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 38 వేల మంది, ఆదివారం 76 వేల మంది ప్రయాణించారని పేర్కొన్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే అనుమతిస్తున్నామని, విధి విధానాలు వచ్చేవరకు ఇలానే కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్ – 17 బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో జిల్లాలోని మేడేపల్లి విద్యార్థులు రాణించారు. మహబూబ్నగర్లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకుంది. జట్టులో పి.యామిని, ఎం.యువర్షిని, బి.కావ్య ప్రతిభ చాటి జిల్లా జట్టును తృతీయస్థానంలో నిలిపేలా కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి కె.నరసింహమూర్తి, ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి కె.ఆదర్శ్కుమార్, బండి నాగేశ్వరావు, పీఈటీ కృష్ణయ్య విద్యార్థినులను అభినందించారు.

