
మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, పక్కన మంత్రులు పొంగులేటి, తుమ్మల తదితరులు
100
రోజుల్లో
ఖమ్మంవన్టౌన్/కూసుమంచి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేశామని, రానున్న 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆయన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఉదయం 10 గంటలకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముగ్గురినీ గజమాలతో సత్కరించారు. కూసుమంచి పీహెచ్సీలో రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ కాన్వాయ్తో ఖమ్మం చేరుకుని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. పాత బస్టాండ్లో మహాలక్ష్మి పథకాన్ని కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన వివిధ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచడమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు వారంటీ లేదని ఎద్దేవా చేసిన వారికి చెంపపెట్టులా రెండింటిని అమల్లోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న ఇళ్లు, పోడు భూములతో పాటు ఇతర సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే గోదావరి జలాలు జిల్లాకు రాలేదని, తాము గోదావరి జలాలతో ప్రతీ రైతు కాళ్లు కడుగుతామని అన్నారు. ప్రజలు నిర్భయంగా బతికేలా పాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసిందని, రానున్న రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాతీర్పు చరిత్రాత్మకం..
రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిప్యూటీ సీఎం భట్టికి అత్యంత క్లిష్టమైన ఆర్థిక, విద్యుత్ శాఖలను అధిష్టానం ఇచ్చిందని, రూ.85 వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ శాఖను పురోగమనంలోకి తీసుకొచ్చే సమర్థుడనే నమ్మకంతోనే ఆ శాఖ ఇచ్చారని చెప్పారు. మరో మంత్రి పొంగులేటికి రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు ఇచ్చారని, ఆ శాఖలు సైతం ఇప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నాయని తెలిపారు. అన్యాక్రాంతమైన వేల ఎకరాల దేవాదాయ, వక్ఫ్ భూములను సంరక్షించాల్సి న బాధ్యత పొంగులేటిపై ఉందన్నారు. ఈ ఇద్దరు మంత్రులూ అవిశ్రాంతంగా పనిచేస్తే తన వ్యవసాయ శాఖ సజావుగా సాగిపోతుందన్నారు. ప్రజలంతా కోరుకున్న ప్రశాంతమైన ఖమ్మాన్ని అప్పగించే బాధ్యతను ముగ్గురు మంత్రులం తీసుకుంటామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, రాందాస్ నాయక్, టీఎస్ ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ సుమ, డీఎంహెచ్ఓ మాలతి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్రెడ్డి, రాయల నాగేశ్వరరావు, తుమ్మల యుగంధర్, సాధు రమేష్రెడ్డి, మద్ది శ్రీనివాస్రెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, రామసహాయం నరేష్రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావీద్, ముస్తఫా, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, దొబ్బల సౌజన్య, విజయాబాయి, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రఫీ, మద్ది శ్రీనివాసరెడ్డి, పగడాల మంజుల, చోటేబాబా, ఎండీ హఫీజుద్దీన్, జూకూరి గోపాలరావు, జొన్నగలగడ్డ రవికుమార్, బెల్లం శ్రీనివాస్, కొంగర జ్యోతిర్మయి, చావా శివరామకృష్ణ, బొడ్డు బొందయ్య, కళ్లెం వెంకటరెడ్డి, మాదాసు ఉపేందర్, బజ్జూరి వెంకటరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాంశెట్టి మనోహర్నాయుడు, అజ్గర్, మట్టా బాబురాంరెడ్డి, వంగవీటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు
తొలి అడుగు వేశాం
పేదలకు కార్పొరేట్ స్థాయి
వైద్యం అందిస్తాం
ప్రజల సొమ్మును గత పాలకులు
తినేశారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రులు పొంగులేటి, తుమ్మల
తిన్న సొమ్మంతా కక్కిస్తాం..
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. త్వరలోనే వారు తిన్న సొమ్మంతా కక్కిస్తామని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే హామీల అమలుకు సీఎం రేవంత్రెడ్డి సంతకం చేశారని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని అన్నారు. శనివారం నుంచే రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని, పేదల ఆరోగ్య రక్షణకు రూ. 5 లక్షల వరకే ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులమై పనిచేస్తామని చెప్పారు. భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆశీస్సులతో మంత్రిగా సేవచేసే భాగ్యం దక్కిందన్నారు. ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులు తీరు మార్చుకోవాలని, గతంలో ఓ నాయకుడి తీరుతో అధికారులు తప్పులు చేశారని, వారంతా పద్ధతి మార్చుకుని ప్రజాసేవ చేయాలని సూచించారు. ఖమ్మంలో భూ కబ్జాలపై కలెక్టర్, సీపీ దృష్టి సారించాలన్నారు.
