నేలకొండపల్లి: ఐదు నెలల కిందట ఐదు గేదెలు మాయమయ్యాయి. సుమారు రూ.4 లక్షల విలువైన గేదెలు కావడంతో రైతు ఊరువాడ తేడా లేకుండా గాలిస్తూనే ఉన్నాడు. అయినా ఫలితం లేకపోయింది. ఇంతలో గేదెలను పంచుకున్న వ్యక్తుల మధ్య గొడవ పోలీసుస్టేషన్కు చేరడంతో వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసుస్టేషన్కు వెళ్లిన రైతుకు గేదెలను అప్పగించగా ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాకు చెందిన రైతు తేజావత్ సైదులుకు సంబంధించి ఐదు గేదెలు ఐదు నెలల కిందట కానరాకుండా పోయాయి. ఎక్కడ వెతికినా ఫలితం లేకుండాపోయింది. అయినా రైతు గాలిస్తూనే ఉన్నాడు. చివరకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాజునాయక్ తండాకు గేదెలు చేరగా, రైతులు పంచుకుని పోషిస్తున్నారు. గేదెల పంపకంపై గొడవ రావడంతో విషయం అక్కడి పోలీసులకు చేరింది. దీంతో గేదెలకు ఉన్న ట్యాగ్లను పరిశీలించటంతో అసలు రైతు వివరాలు తెలిశాయి. ఆ వెంటనే మంగాపురంతండా సర్పంచ్ భూక్యా సుధాకర్కు సమాచారం ఇవ్వగా ఆయన స్థానికులు, రైతుతో కలిసి శనివారం తిరుమలగిరి వెళ్లగా గేదెలను అప్పగించారు. ఐదు నెలల తర్వాత గేదెలను చూసిన రైతు సైదులు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే, గేదెలను దొంగిలించారా లేక స్థానికులే ఎవరైనా వదిలేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
పంచుకున్న వారి మధ్య గొడవతో వెలుగులోకి..