
● 18,922 మంది రైతులకు రూ.23,63,24,250
ఖమ్మంవ్యవసాయం: అకాల వర్షాలతో మార్చి నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 21వ తేదీ వరకు ఈదురుగాలులు, అకాల వర్షాలతో కోత దశలో ఉన్న మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 18,922 మంది రైతుల 23,632.17 ఎకరాల్లో పంటకు నష్టం జరిగిందని నిర్ధారించారు. కాగా, పంట నష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బోనకల్ మండలంలో పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా రైతులకు రూ.23,63,24,250 పరిహారం విడుదలైంది. ఈ నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. ఇదిలా ఉండగా ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈదురుగాలులు, వడగళ్ల వానలు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమకు సైతం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
జమలాపురంలో ‘ఆవిర్భావ’ పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేయడంతో పాటు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్య కల్యాణం జరిపించారు. ఈ పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు బి.శ్రీనివాస్, విజయకుమారి పాల్గొన్నారు.
10న జాతీయ
లోక్ అదాలత్
ఖమ్మంలీగల్: ఈనెల 10వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ జావీద్ పాషా పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో శుక్రవారం ఆయన పోలీసు కోర్ట్ డ్యూటీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జావీద్పాషా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసుల్లో ఎక్కువగా రాజీ పడదగినవే ఉన్నందున లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రతీ పోలీస్స్టేషన్ నుంచి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు లైజన్ అధికారులు సాంబిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జాఫర్ బావి పునరుద్ధరణ పనులు పరిశీలన
ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో పురాతన చరిత్ర కలిగిన జాఫర్ బావి పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈమేరకు శుక్రవారం కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్పన తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకవచాలతో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి అంతరాలయంలో శుక్రవారం సందర్భంగా మూలమూర్తులను స్వర్ణకవచాలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

జాఫర్ బావి వద్ద కమిషనర్ ఆదర్శ్, తదితరులు

నిత్యకల్యాణ ం జరిపిస్తున్న అర్చకులు