
● జిల్లాలో 20.42 శాతం పెరిగిన సాగు విస్తీర్ణం ● ఇందులో సింహభాగం వరిదే... ● రైతుబంధు ద్వారా రూ.3,125.41 కోట్లు పంపిణీ ● మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా ● తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో వ్యవసాయం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. గతంతో పోలిస్తే రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ సాగునీటి వనరులను మెరుగుపర్చటం, పెంచటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అలాగే, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా ఏటా వానాకాలం, యాసంగిలో రైతులకు ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం అందిస్తుండడమే కాక బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టి రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఇక వంట నూనెలకు డిమాండ్ పెరిగిన నేపథ్యాన ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండడంతో జిల్లాలో గణనీయంగా పెరిగిన ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేకంగా రైతు దినోత్సవాన్ని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది కాలంలో జిల్లాలో వ్యవసాయ రంగం ప్రగతిపై కథనం.
తొమ్మిదేళ్లలో 20.42 శాతం పెరిగిన విస్తీర్ణం
గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో జిల్లాలో సాగు విస్తీర్ణం 20.42 శాతం పెరిగింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2014–15 సంవత్సరం వానాకాలంలో 5,84,580 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. అయితే, గడిచిన వానాకాలం(2022)లో 7,03,975 ఎకరాల విస్తీర్ణంలో పంటలను రైతులు సాగు చేశారు. దీంతో 1,19,395 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లయింది. ఆయకట్టు స్థిరీకరణ, సాగునీటి సామర్థ్యం పెంచటంతో వరి పంట విస్తీర్ణం సుమారు 77.65 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. 2014కు ముందు 4,44,391 ఎకరాలకు నీటి సౌకర్యం ఉండగా, నేడు 5,07,398 ఎకరాలకు నీటి సౌకర్యం అందుతోంది. దీంతో నాడు 1,63,180 ఎకరాలుగా ఉన్న వరి సాగు నేడు 2,89,899 ఎకరాలకు చేరింది. తద్వారా 2,93,724 టన్నులుగా వరి ధాన్యం ఉత్పత్తి ఇప్పుడు 7,24,747 టన్నులకు చేరడం విశేషం.
పెట్టుబడి సాయం.. బీమా
వ్యవసాయ రంగాన్ని పోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి పంటల సాగుకు పెట్టుబడి ఇచ్చేలా రైతుబంధు పథాన్ని ప్రవేశపెట్టింది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 3,16,174 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.3,125.41 కోట్లు పెట్టుబడి సాయంగా అందాయి. అలాగే, రైతులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేలా బీమా సౌకర్యం కల్పించారు. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించగా, మరణించిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా నగదు అందుతోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 4,319 మంది రైతులు మరణించగా వారికి రూ.2,159.5 కోట్లు అందించారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యం
వంట నూనెలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ఆయిల్ పామ్కు ప్రాధాన్యమిస్తోంది. ఈక్రమంలో జిల్లాలో ఉన్న అనుకూల పరిస్థితుల నేపథ్యాన రైతులు ఆసక్తి కనబరిచారు. దీంతో 2014కు ముందు జిల్లాలో 3,275 ఎకరాలుగా ఉన్న ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ప్రస్తుతం 14,178 ఎకరాలకు చేరి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఏఈఓల నియామకం, రైతు వేదికల ఏర్పాటు
ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు. జిల్లాలో మొత్తం 129 క్లస్టర్లను ఏర్పాటు కాగా అంతే సంఖ్యలో ఏఈఓలు నియమితులయ్యారు. ప్రభుత్వం అమలుచేసే వ్యవసాయ పథకాలన్నీ ఏఈఓల ద్వారానే రైతుల దరిచేరుతున్నాయి. అలాగే, రైతులకు అవగాహన సమావేశాల కోసం ప్రతీ క్లస్టర్లో రైతు వేదికలను నిర్మించగా అధికారులు అందుబాటులోకి వచ్చారు. కాగా, తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రైతు దినోత్సవ వేడుకలను కూడా ఈ వేదికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
సాగుతో ఉత్పత్తి కూడా పెరిగింది..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సాగు విస్తీర్ణం పెరగడమే కాక పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ రైతులను పోత్సహిస్తోంది. శనివారం రైతు వేదికల్లో జరిగే రైతు దినోత్సవానికి అన్నదాతలు హాజరై విజయవంతం చేయాలి.
– ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయాధికారి

రైతు దినోత్సవానికి ముస్తాబైన వేంసూరు మండలం కందుకూరులోని రైతువేదిక
