దశాబ్ద కాలంలో వేగంగా గిరిజనాభివృద్ధి
భద్రాచలం: ఎందరో అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలంలో గిరిజనుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో ఆయన అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించాక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆశ్రమ, ఉన్నత ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల సంఖ్య పెరగగా, ప్రస్తుతం 24,587 మంది విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే, ఉపకార వేతనాలు అందించడంతో పాటు రెండు క్రీడా పాఠశాలలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇంకా మూడు వైటీసీల ద్వారా నిరుద్యోగ యువతకు ఇస్తున్న ఉచిత శిక్షణతో అనేక మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఇంకా ట్రైకార్ ద్వారా నిరుద్యోగ, నిరుపేద గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 17న నిర్వహించే గిరిజన సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పీఓ కోరారు. కార్యక్రమంలో ఏపీఓ (జనరల్) ఇన్చార్జ్ ఆర్సీఓ, డీడీ డేవిడ్రాజ్, అధికారులు తానాజీ, భీమ్, విజయ్కుమార్, భాస్కర్, సురేశ్బాబు, అశోక్కుమార్, ఆర్.శ్రీనివాస్, ప్రభాకర్రావు, ఆదినారాయణ, రమణయ్య, నర్సింగ్రావు, హరికృష్ణ పాల్గొన్నారు.
అవతరణ ఉత్సవాల్లో ఐటీడీఏ పీఓ
గౌతమ్ పొట్రు