గణనీయంగా ఎదిగిన సింగరేణి
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో
డైరెక్టర్ బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణ ఏర్పడక ముందు 479 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిన సింగరేణి గడిచిన 2022–23లో 39 శాతం వృద్ధితో 671 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాతో రికార్డు సృష్టించిందని సంస్థ డైరెక్టర్ (పా) ఎన్.బలరామ్ వెల్లడించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ వేడులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తొలుత సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట పార్క్లో తెలంగాణ తల్లి విగ్రహానికి, బస్టాండ్ సెంటర్ సమీపాన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రూ.12 వేల కోట్ల టర్నోవర్ కలిగిన సింగరేణి సంస్థ ఈ ఏడాది రూ.33 వేల కోట్లకు ఎదిగిందని చెప్పారు. కాగా, సింగరేణి వ్యాప్తంగా 5వ తేదీన తెలంగాణ దశాబ్ది వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సింగరేణి మెయిన్ వర్క్షాపు ఉద్యోగులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆ తర్వాత వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో డైరెక్టర్లు ఎన్వీకే.శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, జీఎంలు కుమార్రెడ్డి, బసవయ్య, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేడు ఎంపీ నామ పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే రైతు దినోత్సవంలో ఎంపీ పాల్గొంటారు.
ప్రారంభమైన ఫుట్బాల్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్బాల్ పోటీలు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సెల్యూకాస్, కె.ఆదర్శ్కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ.. అండర్–10, 14 పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 14 జట్లు హాజరయ్యాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వి.మోహన్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.