ఇంకా ఖమ్మం క్వార్టర్కు అద్దె కడుతున్నా..
సత్తుపల్లిరూరల్: నోటికొచ్చినట్టు తనపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేది లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం ఎన్నెస్పీ క్వార్టర్లో ఉంటున్నందుకు ప్రతినెలా రూ.5 వేలు అద్దె చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్వార్టర్కు అద్దె కడుతున్నప్పటికీ కొందరు రెగ్యులర్ చేయించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో స్థలాలు రెగ్యులర్ చేసుకున్నవాళ్లు రేషన్ బియ్యానికి గతి లేని వాళ్లా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మమత సొసైటీ, హార్వెస్ట్ సొసైటీ, ఇతర విద్యాసంస్థల సొసైటీలకు వేలాది గజాల ప్రభుత్వ స్థలాలను రెగ్యులర్ చేశారని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు రెగ్యులర్ చేయడంలో తాను మొదటి వాడిని, చివరి వాడిని కాదని.. ఎవరికై నా సందేహాలు ఉంటే తాను అద్దె చెల్లించిన రశీదులు పరిశీలించుకోవాలని సూచించారు.
నేడు కొత్తూరు నుంచి కాకర్లపల్లి వరకు ర్యాలీ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కొత్తూరు రైతువేదిక నుంచి కాకర్లపల్లి వరకు భారీ సంఖ్యలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు రైతులు, పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు వనమా వాసు, చల్లగుండ్ల కృష్ణయ్య, అద్దంకి అనిల్, ఎస్కే మౌలాలి, కృష్ణారావు, ఎండీ గఫార్ఖాన్, గుండ్ర రాఘవేంద్రరావు, మేకల కృష్ణ, ఎండీ అబ్దుల్లా పాల్గొన్నారు.
పొంగులేటి, మమత సొసైటీలకు వేలాది గజాలు రెగ్యులర్ చేశారు
సత్తుపల్లి ఎమ్మెల్యే
సండ్ర వెంకటవీరయ్య