అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి పచ్చిరొట్ట విత్తనాలు

Jun 3 2023 12:08 AM | Updated on Jun 3 2023 12:08 AM

జీలుగు, జనుము పంట (ఇన్‌ సెట్‌) జీలుగు విత్తనాలు - Sakshi

జీలుగు, జనుము పంట (ఇన్‌ సెట్‌) జీలుగు విత్తనాలు

● ముందస్తు పంట కాలానికి అనుగుణంగా విత్తన పంపిణీ ● 65 శాతం సబ్సిడీపై అమ్మకానికి ఏర్పాట్లు ● సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయం

ఖమ్మంవ్యవసాయం: పంటల సాగు కాలాన్ని ముందే మొదలుపెట్టేలా ప్రభుత్వం నిర్ణయించగా.. అవసరమైన విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ప్రధాన పంట అయిన వరిని నెల ముందుగా సాగు చేయించేందుకు ప్రభుత్వ సూచనలతో అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకం మొదలుపెట్టారు. పచ్చిరొట్ట విత్తనాలకు 65 శాతం సబ్సిడీ ప్రకటించగా.. ఇప్పటికే 90 శాతం మేర విత్తనాలను రైతుల ముంగిటకు చేర్చారు.

వ్యవసాయ శాఖ ఇండెంట్‌ ఆధారంగా..

వ్యవసాయ శాఖ ఇండెంట్‌ మేరకు జీలుగు, పిల్లి పెసర, జనుము విత్తనాలను తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతుల దరికి చేర్చింది. జీలుగు 23,000 క్వింటాళ్లలో ఇప్పటికే 19,800 క్వింటాళ్లు, పిల్లి పెసర 808 క్వింటాళ్లలో 300 క్వింటాళ్లు, జనుము 870 క్వింటాళ్లలో 820 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వరి సాగు కాలం నెల ముందుకు రావటంతో రైతులు నారుమళ్లు సాగు చేసే మళ్లు మినహా మిగిలిన భూమిలో పచ్చిరొట్ట విత్తడం ఆనవాయితీ. పచ్చిరొట్టను 30 నుంచి 40 రోజుల పాటు పొలాల్లో పెంచి నాట్లు వేసే సమయానికి భూముల్లో కలియదున్నడంతో భూమిలో సారం పెరుగుతుంది.

సబ్సిడీపై విక్రయాలు

వివిధ పంటల విత్తనాలకు సబ్సిడీ రద్దు చేసిన ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలకు మాత్రం కొనసాగిస్తోంది. పంట క్షేత్రాల్లో భూసారాన్ని పెంచే ఈ పంటల సాగును ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ 65 శాతం సబ్సిడీపై విత్తనాలు అమ్ముతున్నారు. జీలుగు 30 కిలోల విత్తన బ్యాగు రూ.842.70కు, పిల్లి పెసర 20 కిలోల బ్యాగ్‌ రూ.703.40కు, జనుము 40 కిలోల బ్యాగ్‌ను రూ.1,224.80కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో 76 పీఏసీఎస్‌లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 పీఏసీఎస్‌ల ద్వారా వరి సాగు చేసే రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాల విక్రయం చేపట్టారు.

డిమాండ్‌ ఉన్న వరి విత్తనాలు కూడా..

రైతులు ఎక్కువగా సాగు చేసే వరి విత్తనాలను అందుబాటులో తీసుకురావడంపై కూడా విత్తనాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. జూలైలో నార్లు పోసి ఆగస్టు నెలాఖరుకు నాట్లు వేయాల్సి ఉండగా, ఆ కాలాన్ని నెల ముందుకు జరిపారు. దీంతో వరిలో దీర్ఘకాలిక రకాలను జూన్‌ 5, మధ్య కాలిక రకాలను 15వ తేదీ, స్వల్పకాలిక రకాలను 25వ తేదీలోగా నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, వరి విత్తనాలకు సబ్సిడీ లేకపోగా.. డిమాండ్‌ ఉన్న విత్తనాలను సరిపడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. రైతులు సాగుకు ప్రాధాన్యం ఇచ్చే, ప్రభుత్వం కొనుగోలు చేసే ఎంటీయూ–1061 రకం విత్తనాలు ఇప్పటికే సహకార సంఘాలకు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు చేర్చారు. అలాగే, సన్నం బీపీటీ (5204) సాంబమసూరి రకం 3 వేల క్వింటాళ్ల విత్తనాలు అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఇంకా పెసర కూడా ఎంజీజీ–295 రకం 800 క్వింటాళ్లను తీసుకొస్తున్నారు.

పచ్చిరొట్ట విత్తనాల ధర (రూ.ల్లో)

విత్తనం మొత్తం ధర సబ్సిడీ చెల్లించాల్సి ధర బ్యాగ్‌ ప్యాకింగ్‌

(కిలోకు) (కిలోకు) బ్యాగ్‌కు (కిలోలు)

జీలుగు 80.25 52.16 842.70 30

పిల్లి పెసర 100.50 65.33 703.40 20

జనుము 87.50 56.88 1224.80 40

కొరత ఎదురుకాకుండా ప్రణాళిక

రైతులకు అవసరమైన విత్తనాల కొరత ఎదురుకాకుండా ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులు ప్రభుత్వం అందించిన రాయితీని వినియోగించుకొని పచ్చిరొట్ట విత్తనాలను కొనుగోలు చేయొచ్చు. అలాగే, వరి, పెసర తదితర విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

–ఎన్‌ భిక్షం, ప్రాంతీయ మేనేజర్‌,

విత్తనాభివృద్ధి సంస్థ, ఉమ్మడి ఖమ్మం జిల్లా

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement