ఘనంగా ‘దశాబ్ది’ ఉత్సవం
ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో పతాకావిష్కరణ
జిల్లావ్యాప్తంగా తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించడంతో పాటు ఉద్యమకారులను త్యాగాలను స్మరించుకున్నారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీల కార్యాలయాల్లో నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవిష్కరించగా సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆవిష్కరించారు. అలాగే, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆధ్వర్యాన పెవిలియన్ మైదానం వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కాగా, కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. – సాక్షి నెట్వర్క్