సమాజ సేవతో పునీతులు కావాలి | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవతో పునీతులు కావాలి

Mar 30 2026 8:50 AM | Updated on Mar 30 2026 8:50 AM

రాయచూరు రూరల్‌: సమాజ సేవతో అందరూ పునీతులు కావాలని అఖిల భారత శరణ సాహిత్య పరిషత్‌ సంచాలకుడు గోరూరు చెన్నబసప్ప పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో స్వాతంత్య్ర సమర యోధుడు, న్యాయవాదిగా సేవలందించిన నాగప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్నత సేవలందించిన వారిని గుర్తించి సన్మానించారు. హిందుస్థానీ సంగీత గాయకుడు అంబయ్య నులిని పూలమాలతో సన్మానించారు. సమావేశంలో నాగప్ప ప్రతిష్టాన అధ్యక్షుడు తిప్పారెడ్డి, మల్లికార్జున, సభ్యులు నాగరాజ్‌, అంబాపతి పాటిల్‌, మహలింగప్ప పాల్గొన్నారు.

నీటి సంపులో

పడి చిన్నారి మృతి

సాక్షి బళ్లారి: తల్లిదండ్రుల అజాగ్రత్త, చిన్నారి ఆటలాడుకునే క్రమంలో నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ ఘటన కొప్పళ జిల్లా కారటగి పట్టణంలోని రాజీవ్‌గాంధీ నగరంలో చోటుచేసుకుంది. కలకప్ప అనే వ్యక్తి కుమార్తె హన్షిక (3) ఇంటి ఎదురుగా హర్షవర్ధన్‌ అనే బాలుడితో కలసి ఆటలాడుకుంటూ నీటి సంపులో పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

రాయచూరు రూరల్‌: సింధనూరు తాలూకాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. కున్నటిగికి చెందిన విరుపాక్షయ్య (22) మల్లన గౌడ (22)లు శనివారం బైక్‌లో వెళ్తూ మార్గం మధ్యలో ట్యాంకర్‌కు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సింధనూరులోని 21వ వార్డుకు చెందిన ముగ్గురు మిత్రులు ద్విచక్ర వాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తూ బంగాలి క్యాంప్‌ వద్ద బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో సయ్యద్‌ యాసిన్‌(29) మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నమిత్తం రిమ్స్‌లో చేర్పించారు. మరో ఘటనలో ఎరువుల బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ నాలుగవ మైలు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పొలం యజమాని విరుపన గౌడ (50), డ్రైవర్‌ సుఖమని (35) మరణించారు. ిసింధనూరు గ్రామీణ సీఐ వీరన గౌడ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర తెలిపారు.

ఫైర్‌ ఇంజన్‌ వాహనం ప్రారంభం

హొసపేటె: నగరంలోని అగ్ని మాపక కేంద్రానికి మంజూరు చేసిన 6 వేలలీటర్ల సామర్థ్యం గల కొత్త ఫైర్‌ ఇంజన్‌ను ఎమ్మెల్యే గవియప్ప జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.80 లక్షల వ్యయంతో 6 వేల లీటర్ల నీటిని అందించే ఫైర్‌ ఇంజన్‌ను ఇవ్వడం జరిగిందని తెలిపారు.

గంజాయి విక్రేతల అరెస్ట్‌

హొసపేటె: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని స్థానిక చిత్తవాడిగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తవాడి పోలీస్టేషన్‌ పరిధిలోని సిద్ధిప్రియ కళ్యాణ మండపం వెనుక గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేశారు. సతీష్‌ కుమార్‌, చిన్నబాలును అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.60 వేలు విలువైన 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చిత్తవాడి పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులను జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. దాడిలో చిత్తవాడి పోలీస్టేషన్‌ పీఐ సోమనాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement