రాయచూరు రూరల్: సర్కార్ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు రవాణా సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి బడిగెర, తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. యర మరాస్ ఆదర్శ విద్యా సంస్థ విద్యార్థుల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి, మహిళ వేదిక ఆధ్వర్యంలో నూతనంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంట్లో విద్య కేవలం సంస్కారం, సంప్రదాయాలు ఆచార వ్యవహారాల కోసమైతే.. పాఠశాలలో లభించే విద్య జీనవ ప్రమాణాలను పెంచుతుందని పేర్కొన్నారు. మన పాఠశాల, మన హక్కు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో శివరాజ్, సంగీత, శివకుమార్ పాటిల్, హఫీజూల్లా, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విలీనం వద్దు
రాయచూరు రూరల్: కర్ణాటక పబ్లిక్ స్కూల్ (కేపీఎస్) ప్రాజెక్టు కింద ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఏఐడీఎస్ఓ నాయకులు వ్యతిరేకించారు. ఆదివారం అరికెర తాలుకా అడకల గుడ్డ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాలకుడు శాంతరాజ్ మాట్లాడుతూ.. కల్యాణ కర్ణాటక భాగంలోని మండళి నిధులను వాడుకోవడం తగదన్నారు. పాఠశాలల విలీనం ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలో ఆదివారం చిప్స్ ప్యాకెట్లతో వెళ్తున్న లారీ మంటల్లో కాలిపోయింది. లారీ బెంగళూరు నుంచి శివపుర హైవే మీదుగా రాష్ట్ర రహదారిపైకి వచ్చి హువినహడగలి వైపు బయలుదేరింది. మార్గంమధ్యలో వాహనానికి విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్, సహాయకుడు వెంటనే లారీ నుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.
ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతి
రాయచూరు రూరల్: నకిలీ వైద్యుడు చేసిన ఇంజక్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన ఆదివారం మస్కి తాలుకాలో చోటుచేసుకుంది. అమినగడకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సింధు (15) శనివారం రాత్రి అనారోగ్యానికి గురి కావడంతో వైద్య చికిత్సల కోసం వైద్యుడు ఉత్తమ్ కుమార్ వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండా సింధుకు ఇంజక్షన్ వేశాడు. ఆదివారం ఉదయానికి విద్యార్థిని శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన మాన్వి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమద్యంలో మృతి చెందింది. సింధు మరణవార్త తెలుసుకున్న నకిలీ వైద్యుడు ఉత్తమ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మాన్వి ప్రభుత్వాస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


