● బుకింగ్ చేసినా దొరకని సిలిండర్లు
● గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం క్యూ
● పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై
వంటల తయారీ
సాక్షి, బళ్లారి: మధ్య ప్రాచ్య దేశాల మధ్య యుద్దం ప్రారంభం కాక ముందు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఒకటి, లేదా రెండు రోజులకే సరఫరా చేసేవారు. యుద్ధం ప్రారంభమయ్యాక గ్యాస్ బుకింగ్ చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంటి గుమ్మానికి చేరడం లేదు. వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. గ్యాస్ కొరతతో పలు హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం మొదలు పెడుతున్నారు. చిన్న చిన్న హోటళ్లను మూసివేసేందుకు సిద్ధం అవుతున్నారు. హోటళ్లు పెట్టుకుని జీవనం సాగించే కుటుంబాలు గ్యాస్ కొరతతో జీవనోపాధి కోల్పోతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు సందట్లో సడేమియా అంటూ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. సిలిండర్ల ధరలకు రెక్కలు రావడంతో హోటళ్లులో ధరలు కూడా పెంచుతున్నారు. గృహ అవసరాలకు రూ.960 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.2,000 ఇచ్చినా ఇవ్వడం లేదు. హోటళ్లు ఇతర వాణిజ్య అవసరాలకు అయితే గ్యాస్ సిలిండర్ను ఏకంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కొన్ని ఏజెన్సీలు విక్రయిస్తున్నాయని హోటల్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసి హోటళ్లు నడుపుతున్నామని చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసి 20 రోజులైనా సిలిండర్ ఇవ్వడం లేదని బళ్లారి నగరానికి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.


