వైభవోపేతం.. కాడు మల్లేశ్వర తేరు ఉత్సవం
బనశంకరి: బెంగళూరు మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మ రథోత్సవం అశేష భక్తజన వాహిని మధ్య నేత్రపర్వంగా సాగింది. సోమవారం వేకువజామున అర్చకుల బృందం కాడు మల్లేశ్వరుని మూలవిరాట్టుకు అర్చనలు, అభి షేకం, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అలంకరణ మంగళ వాయిద్యాల మధ్య తేరులో అధిష్టించారు. వేలాది భక్తుల మధ్య ప్రధాన తేరును, చిన్న తేర్లను లాగారు. 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. 15 కు పైగా జానపద కళాబృందాల నృత్యాల ప్రదర్శన మరింతగా రంజింపజేసింది. యక్షగానం, వీరగాసె, కేరళ డ్రమ్స్, డొళ్లు కుణిత, సాధువుల తలల నుంచి మంటల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
బెంగళూరు మల్లేశ్వరంలో జనసందడి


