బాగేపల్లి ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు
బొమ్మనహళ్లి: చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి (భాగ్యనగర్) కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. సుబ్బారెడ్డి నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గత ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి మునిరాజు గతంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సాగుతోంది. జస్టిస్ ఎంజీఎస్ కమల్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇవ్వడంతో సుబ్బారెడ్డి శిబిరంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే మునిరాజును విజేతగా ప్రకటించడానికి కూడా ధర్మాసనం నిరాకరించి, కేసును తిరిగి ఎన్నికల కమిషన్, అసెంబ్లీ కార్యదర్శికి పంపాలని ఆదేశించింది. సుబ్బారెడ్డి ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి తీవ్ర వాదనల మధ్య జడ్జి ఆమోదించారు.
కేసు ఏమిటీ?
2023, మే లో జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి 82,128 ఓట్లు సాధించి గెలిచారు. బీజేపీ అభ్యర్థి సి.మునిరాజుకు 62,949 ఓట్లు వచ్చాయి. అయితే సుబ్బారెడ్డ ఎన్నికల అఫిడవిట్లో భార్య, కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి సరైన సమాచారం ఇవ్వలేదంటూ మునిరాజు గతంలో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆయన ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు.
సుబ్బారెడ్డికి చుక్కెదురు
బీజేపీ అభ్యర్థి మునిరాజు కేసులో హైకోర్టు ఆదేశం


