 
															లవ్ జిహాద్ కేసులో అరెస్టు
దొడ్డబళ్లాపురం: యువతిని ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా వాడుకుని తరువాత మతం మారలేదంటూ ముఖం చాటేసిన మోసగాన్ని బెంగళూరు అమృతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ బిన్ ఇషాక్ అరైస్టెన నిందితుడు. ఈ సంఘటనను లవ్ జిహాద్గా భావిస్తున్నారు. 2024లో ఇన్స్టా ద్వారా యువతితో పరిచయం పెంచుకున్న ఇషాక్ ఆమెను ప్రేమించినట్టు నటించాడు. తరువాత షికార్లు చేశారు, వివాహం చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి అడిగితే తమ మతంలోకి మారాలని లేదంటే ఇంట్లో ఒప్పుకోరని, పైగా ప్రైవేటు ఫోటోలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ సెప్టెంబరు 14న ఇంట్లో చూసిన ఓ యువతిని నిశ్చితార్థం చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించి నిందితున్ని అరెస్టు చేశారు.
సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
● వృద్ధురాలు మృతి
కృష్ణరాజపురం: వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించి ఇల్లు నేలమట్టమైన ఘటన శనివారం ఉదయం బెంగళూరులోని కృష్ణరాజపురం త్రివేణినగరలో జరిగింది. ఇంటి శిథిలాల కింద ముగ్గురు చిక్కుకోగా, ఒక వృద్ధురాలు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలిని అక్కయమ్మ (80)గా గుర్తించారు. శేఖర్ (52), కిరణ్ (22) చందన్ (25)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విస్ఫోటం వల్ల చుట్టుపక్కల ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. పోలీసులు విచారణ చేపట్టారు.
టీవీ నటి బ్లాక్మెయిలింగ్
● మహిళ ఫోటోలు సేకరించి
డబ్బు కోసం డిమాండ్
యశవంతపుర: టీవీ సీరియళ్ల కథల గురించి అందరికీ తెలిసిందే. అందులో పాత్రధారులు నిరంతరం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. అదేమాదిరి ఓ నటి నిజ జీవితంలోనూ ప్రవర్తించింది. కన్నడ టీవీ సీరియల్స్లో నటించి పేరుపొందిన నటీమణి ఆశా జోయిస్ నేరారోపణల్లో చిక్కుకుంది. ఓ మహిళ ప్రైవేట్ వీడియో, ఫోటోలను దొంగతనం చేసి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించినట్లు బెంగళూరు నగర తిలక్ నగర ఠాణాలో ఫిర్యాదు దాఖలైంది.
డబ్బు ఇవ్వకపోవడంతో..
శృంగేరి శారదా పీఠం జోయిస్ కుటుంబ సభ్యురాలు, బుల్లితెర నటి ఆశా జోయిస్ పై పార్వతి (61) అనే మహిళ ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఆశా 2016లో మిస్ ఇండియా ప్లానెట్లో పోటీలలో విజేతగా నిలిచారు, తరువాత టీవీ సీరియళ్లలో నటించింది. ఆశాకు బాధితురాలు స్నేహితురాలు అయ్యింది. ఆమె కూడా టీవీ నటి అని చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆశా.. బాధితురాలి వీడియోలను సేకరించి ఆమె భర్తను డబ్బు కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇందుకు వారు తిరస్కరించడంతో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలికి తెలిసినవారికి పంపించింది. దీనివల్ల తనకు తీవ్ర అవమానం అయ్యిందని బాధిత మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.
బీజేపీ నేత ఖూబాకు
రూ.25 కోట్ల జరిమానా
దొడ్డబళ్లాపురం: అక్రమ మైనింగ్ కేసులో బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి భగవంత్ ఖూబాకు భారీ జరిమానా విధిస్తూ నోటీసులు వెళ్లాయి. కలబుర్గి జిల్లా కాళగి తహసీల్దార్ రూ.25.30 కోట్లు చెల్లించాలని ఖూబాకు నోటీసులు పంపించారు. కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వచ్చా గ్రామం పరిధిలో 2014 జూన్ నుంచి 2019 జూన్ వరకూ 2 ఎకరాలకు అనుమతి తీసుకుని 8 ఎకరాలలో గనుల తవ్వకాలు జరిపారని నోటీసుల్లో పేర్కొన్నారు. సంజీవ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ, కాళగి తహసీల్దార్ జంటగా దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమని తేల్చారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చి రూ.25.30 కోట్లు చెల్లించాలని ఆదేశించగా, దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు.
 
							లవ్ జిహాద్ కేసులో అరెస్టు
 
							లవ్ జిహాద్ కేసులో అరెస్టు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
