తుంగభద్ర పరవళ్లు
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన నదీ పరివాహకంలోని తీర్ధహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం 24 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. దీంతో 5 గేట్లను రెండున్నర అడుగుల మేరకు పైకెత్తి దిగువకు 18 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో నదికి ఇరువైపుల లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, నీటినిల్వ 80.003 టీఎంసీలు, ఇన్ఫ్లో 24,500 క్యూసెక్కులుగా ఉందని మండలి వర్గాలు తెలిపాయి. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పర్యాటకులతో డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం డ్యాం వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. గేట్ల నుంచి దిగువకు పారుతున్న నీటిని వీక్షించి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.
తుంగభద్ర పరవళ్లు


