
రూ.5వేల కోసం కళాకారుడి హత్య
హుబ్లీ: రూ.5 వేల కోసం కళాకారుడిపై మరుణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా బుడిహళ్ వద్ద జరిగింది. 22 ఏళ్ల మారుతీ అడివప్ప లట్టే ఉత్తర కర్ణాటక శైలిలో పాటలు పాడటం ద్వారా ప్రజాదరణ పొందాడు. కుటుంబ అవసరాల కోసం ఈరప్ప అనే వ్యక్తి నుంచి మారుతీ రూ.50వేలు అప్పు తీసుకున్నాడు. రూ.45వేలు తిరిగి చెల్లించాడు. తన పాటలకు ఆదరణ పెరగడంతో పనికి వెళ్లకుండా పాటలు పాడటంతో నిమగ్నమై రూ.5వేల బాకీ చెల్లించచడంలో జాప్యం జరిగింది. ఈక్రమంలో స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తుండగా ఈరప్ప హక్కివాటేతో పాటు 11 మంది మారుతీపై మారణాయుధాలతో దాడి చేశారు. అనంతరం అతనిపై కారు ఎక్కించారు. దీంతో మారుతీ ఘటన స్థలంలోనే మృతి చెందగా స్నేహితుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితులు కూడా గాయపడ్డారు. రాయభాగ్ పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడు ఈరప్ప గోకాక్, సిద్దరామ వడియార్, ఆకాశ్ పూజారిని అరెస్ట్ చేశారు.
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు
రాయచూరు రూరల్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంపీ కుమార నాయక్ సూచించారు. పండిత సిద్దరామ జంబల దిన్నిరంగ మందిరంలో వాల్మీకి నాయక్ సమాజం ఆధ్వర్యంలో ఆ సముదాయంలోని ప్రతిభావంత విద్యార్థులను ఆదివారం ఆయన ప్రతిభాపురస్కారాలతో సన్మానించి మాట్లాడారు. విద్యకు ఉన్న ప్రాధాన్యత ఇతర ఏరంగానికీ లేదన్నారు. స్వామీజీలు రవి, మాజీ శాసన సభ్యులు గంగాధర నాయక్, రాజా వెంకటప్ప నాయక్, నగరసభ ఉపాధ్యక్షుడు సమీర్, శ్రీనివాస రెడ్డి, రమేష్, సమాజం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ రూప, శివ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
వృత్తి శిక్షణ కోర్సు ప్రారంభం
హుబ్లీ: స్థానిక సవాయి గంధర్వ హళ్ వద్ద ఉన్న జయప్రియ వృత్తిపర శిక్షణ కేంద్రంలో 2025 ఏడాదికి గాను డిప్లోమో ఇన్ అఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సును ప్రారంభించారు. హుబ్లీలోని ప్రముఖ జయప్రియ కంటి ఆస్పత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ వెంకటరామ్ కట్టి, ఈఎన్పీ నిపుణులైన డాక్టర్ ప్రియ కట్టి మార్గదర్శకత్వంలో మహిళా అభ్యర్థుల కోసం ఈ కోర్సు ప్రారంభించారు.
ఎంఆర్ఐ సెంటర్ ప్రారంభం
హొసపేటె: ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ సేవలను జిల్లావాసులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గవియప్ప సూచించారు. పట్టణంలోని రైల్వే రహదారిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీబీ, క్యాన్సర్కు సంబంధించి స్కానింగ్ సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. ఆర్థో పెడిక్ వైద్యులు యువరాజ్, జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్, వైద్యులు విశ్వానాథ్, సాలియా, జుబేర్ పాల్గొన్నారు.
పాత్రికేయుల సేవలు అపారం
చెళ్లకెరె రూరల్: పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు అపారమని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి చెందిన శివరశ్మి అన్నారు. పట్టణంలోని బ్రహ్మకుమారీ ఈశ్వరి విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన పత్రికా దినాచరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాత్రికేయులు సమాజంలోని లోపాలను ఎత్తిచూపి సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పాత్రికేయులు ఒత్తిడి నుంచి దూరం కావడానికి ధ్యానం చేయాలన్నారు. అనంతరం పాత్రికేయులను సన్మానించారు.
3 పులి కూనలు మృత్యువాత
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్టలోని జూ పార్క్లో ఐదు రోజుల క్రితం జన్మించిన పులి పిల్లలు తల్లి పులి పాలు ఇవ్వకపోవడంతో ఆకలితో చనిపోయాయి. 7వ తేదీన హిమాదాస్ అనే ఏడేళ్ల ఆడ పులి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకటి మగది. కానీ తల్లి పులి ఎందుకో ఆగ్రహంగా ప్రవర్తించింది. కూనలను దగ్గరకు రానివ్వలేదు. కరిచి గాయపరచడంతో పాటు కాళ్లతో తొక్కింది. పాలు కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితితో కూనలన్నీ మృత్యువాత పడ్డారు. అయితే పిల్లలను కాపాడడానికి తాము చాలా ప్రయత్నం చేశామని జూ సిబ్బంది చెబుతున్నారు.
డివైడర్కు కారు ఢీ..
ఐదుమందికి గాయాలు
చింతామణి: కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి డీవైడర్ని ఢీ కొన్న ప్రమాదంలో ఐదుమంది గాయపడ్డారు. కారు నుజ్జు నుజ్జు అయిన సంఘటన రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఐమరరెడ్డి పల్లి క్రాస్ దగ్గర ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. బెంగళూరు చిక్కజాలకు చెందిన అనంతకుమార, వెంకటేశ, లక్ష్మీకాంత, రామచంద్ర, అంబరీష్ కారులో బోయకొండ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనాలు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. గాయపడి కారులో ఇరుక్కున్నవారిని స్థానికులు బయటకు తీసి చింతామణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి సాగించారు.

రూ.5వేల కోసం కళాకారుడి హత్య

రూ.5వేల కోసం కళాకారుడి హత్య