
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని సంయుక్త కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్లుగా వేతనాలు ఇవ్వాలని, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి పలికి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకొని, పెంచిన ధరలను తగ్గించాలన్నారు.