
ఇళ్ల నిర్మాణాల్లో అవినీతిపై ఆందోళన
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చాక, అన్నింటా అవినీతి, అక్రమాలు, పర్సెంటేజీలు లేకుండా ఏ పనులూ చేయడం లేదని, చివరకు స్లం బోర్డు ద్వారా చేపట్టే పేదలకు ఇళ్ల నిర్మాణాలను కూడా అర్ధంతరంగా ఆపేశారని, లంచాలు ఇస్తేనే ఇళ్లు మంజూరు చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్లం నిర్మూలన మండలి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా మోర్చా పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఇళ్ల నిర్మాణాల్లో అవినీతిపై ప్రశ్నిస్తున్నారంటే అవినీతి పతాక స్థాయికి చేరిందని మండిపడ్డారు. లంచం ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
ఇన్ఛార్జి మంత్రి అవసరమా?
ఈ నేపథ్యంలో ఇలాంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అవసరమా? అంటూ ప్రశ్నించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ పేదల ఇళ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయన అవినీతిపై తనిఖీ చేయాలని, తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బళ్లారి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పేరుకే కాని ఆయన జిల్లాకు వచ్చి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అంతా అవినీతిమయంగా మార్చారన్నారు. చివరకు పేదల ఇళ్ల నిర్మాణాల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అలాంటి అవినీతి మంత్రిని పదవి నుంచి తప్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. నగరంలో 2019లో 1160 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు.
అర్థంతరంగా ఆగిన నిర్మాణాలు
అర్ధంతరంగా ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. 100 ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం కాలేదన్నారు. లబ్ధిదారులు వాటా కింద డబ్బులు కూడా చెల్లించారని, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్న గుడిసెలు కూడా తొలగించి, గూడు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో 14,700 మందికి పట్టాలు మంజూరు చేశామని, అయితే అందులో 1000 మంది లోపు మాత్రమే అనుమతి ఇచ్చారని, మిగిలిన వేలాది మందికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈసందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు నిలువ నీడ లేకుండా పోయిందన్నారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని కన్నీరు పెట్టుకున్నారు. సంబంధిత అధికారులతో బీజేపీ నాయకులు చర్చించి, సత్వరం బాధితులకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మేయర్, పాలికె ప్రతి పక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, బీజేపీ నాయకులు హనుమంతప్ప, రామచంద్రయ్య, మల్లనగౌడ, చెంచు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కళంకితులు పదవులకు రాజీనామా చేయాలి
కదం తొక్కిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు