అర్జున స్మారకానికి విఘ్నాలు | - | Sakshi
Sakshi News home page

అర్జున స్మారకానికి విఘ్నాలు

Jun 24 2025 4:27 AM | Updated on Jun 24 2025 4:27 AM

అర్జున స్మారకానికి విఘ్నాలు

అర్జున స్మారకానికి విఘ్నాలు

మంత్రికి ఎమ్మెల్యే షరతులు..

ప్రారంభోత్సవం వాయిదా

మైసూరు: మైసూరు దసరా వేడుకల్లో అమ్మవారి బంగారు అంబారీని మోసి లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న గజరాజు కెప్టెన్‌ అర్జున స్మారకం ప్రారంభానికి విఘ్నాలు అడ్డు పడుతున్నాయి. గతంలో హాసన్‌ జిల్లాలో అటవీ సిబ్బంది పొరపాటుగా కాల్పులు జరపడంతో తూటాలు తగిలి అర్జున చనిపోవడం తెలిసిందే. ప్రజల డిమాండ్‌ మేరకు స్మారకాన్ని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరాల వల్ల సోమవారం జరగాల్సిన స్మారకం ప్రారంభం వాయిదా పడింది. మైసూరు జిల్లాలోని నాగరహోళె అడవిలో డి.బి.కుప్పెలో అర్జున స్మారకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె ఇందుకోసం మండ్యలోని శ్రీరంగపట్టణం వరకూ వచ్చారు. అయితే హెచ్‌.డి.కోటె ఎమ్మెల్యే అనిల్‌ చిక్కమాదు.. కొన్ని షరతులు పెట్టారని తెలిసింది. స్మారకం ప్రారంభించిన రోజే స్థానిక ప్రజలతో ఏనుగుల దాడులు , నివారణ గురించి సమావేశం జరపాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఇప్పడు చర్చ వద్దు అని మంత్రి చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దాంతో మంత్రి కార్యక్రమాన్ని వాయిదా వేయించి బెంగళూరుకు వెళ్లిపోయారు.

రూ.4 వేల కోట్ల భూమిలో కబ్జాల తొలగింపు

శివాజీనగర: బెంగళూరు తూర్పు తాలూకా బిదరహళ్లి ఫిర్కా, కాడుగోడి ప్లాంటేషన్‌ 120 ఎకరాల అటవీ భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. భారీ పోలీస్‌ బందోబస్తుతో సోమవారం ఉదయమే జేసీబీలతో నగర అటవీ శాఖ అధికారులు కబ్జాల తొలగింపును ప్రారంభించారు. ఆ భూమిని పునః స్వాధీనానికి కార్యచరణ కొనసాగుతోంది. సరిహద్దులను గుర్తించి కంచె వేసి, మొక్కలను నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ అటవీ భూమి మార్కెట్‌ విలువ సుమారు రూ. 4 వేల కోట్లుగా అంచనా వేశారు. కాడుగోడి అటవీ ప్రాంతం ఆక్రమణల గురించి ఇటీవల అటవీ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సమీక్ష జరిపారు. బెంగళూరులో కబ్జాలకు గురైన అటవీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

సీఎం ఢిల్లీ యాత్ర

ప్రధాని, రాష్ట్రపతితో భేటీ?

శివాజీనగర: సీఎం సిద్దరామయ్య సోమవారం సాయంత్రం హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశముంది. పలు ఎమ్మెల్సీ పదవుల భర్తీ చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండగా, హైకమాండ్‌ నాయకులతో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు బిల్లులు కేంద్రంలో పెండింగ్‌లో ఉండగా, వాటికి ఆమోదం కావాలని సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారు. పన్నుల వాటాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతోందని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఒకవేళ రాజ్‌భవన్‌, రాష్ట్రపతి భవన్‌ నుంచి సానుకూలంగా స్పందన లభించకపోతే ఏమి చేయాలన్నది హైకమాండ్‌తో మాట్లాడతారని సమాచారం. సమాఖ్య వ్యవస్థను కాపాడాలని సిద్దరామయ్య కోరనున్నారు. రాష్ట్రంలో పథకాల గురించి పలువురు కేంద్ర మంత్రులను కూడా భేటీ చేయనున్నారు. అప్పాయింట్‌మెంట్‌ మీద ప్రధాని ఆఫీసు నుంచి ఇంకా సమాచారం రాలేదని తెలిసింది.

వాహనం ఢీకొని టెక్కీ మృతి

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో బాణసవాడి పరిధిలో హిట్‌ అండ్‌ రన్‌లో ఓ టెక్కీ మృతిచెందాడు. మృతున్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన సలగున ప్రదీప్‌ (25)గా గుర్తించారు. ఓ సంస్థలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్న ప్రదీప్‌ కల్కెరెలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బైక్‌పై కళ్యాణ్‌ నగరకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా ఢీకొన్న వాహనం కోసం శోధిస్తున్నారు.

బాలికను విక్రయించాలని కిడ్నాప్‌

శివాజీనగర: ఐదేళ్ల బాలికను కిడ్నాస్‌ చేసిన ఇద్దరిని బెంగళూరు జ్ఞానభారతి పోలీసులు అరెస్ట్‌ చేశారు. బసమ్మ, సులోచన అనే ఇద్దరు మహిళలు నిందితులు. 21న విశ్వేశ్వరయ్య లేఔట్‌లో ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి సింధనూరుకు పిలుచుకొని వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు కూడా సింధనూరు నుంచి వచ్చి కూలిపనులు చేసుకుంటున్నారు. కుమార్తె కనిపించటం లేదని తల్లిదండ్రులు జ్ఞానభారతి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించగా వివరాలు తెలిశాయి. రాయచూరు పోలీసులకు సమాచారం అందించి నిందితులను అరెస్ట్‌ చేశారు. బిడ్డను వేరేవారికి అమ్మేయడానికి తీసుకెళ్లినట్లు నిందితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement