ఈడీ ముందుకు డిప్యూటీ సీఎం తమ్ముడు | - | Sakshi
Sakshi News home page

ఈడీ ముందుకు డిప్యూటీ సీఎం తమ్ముడు

Jun 24 2025 4:27 AM | Updated on Jun 24 2025 12:06 PM

ఈడీ ముందుకు డిప్యూటీ సీఎం తమ్ముడు

ఈడీ ముందుకు డిప్యూటీ సీఎం తమ్ముడు

బనశంకరి: ఐశ్వర్యగౌడ అనే కిలాడీ మహిళ నగల వ్యాపారి నుంచి రూ.9.82 కోట్ల నగలు తీసుకుని డబ్బు ఎగ్గొట్టడం, పలు మోసాల కేసుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తమ్ముడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ డీకే.సురేశ్‌ సోమవారం ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సోమవారం బెంగళూరులోని శాంతినగర ఈడీ ఆఫీసుకు వచ్చారు. ఐశ్వర్య బాధితులు చంద్రాలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా నగదు బదిలీ జరిగిందని ఈడీ కూడా విచారణ సాగిస్తోంది. గతంలో ఐశ్వర్య నివాసాలలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీకే సురేశ్‌కు నోటీసులు ఇచ్చారు. వందలాది మద్దతుదారులు ఆయన వెంట రావడంతో ఈడీ ఆఫీసు వద్ద కోలాహలం నెలకొంది. గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.

ఆమెతో లావాదేవీలు లేవు
కొన్ని గంటలపాటు సురేశ్‌ను అధికారులు విచారించి పంపించారు. సురేశ్‌ మాట్లాడుతూ విచారణకు పూర్తి సహకారం అందించాను, ఐశ్వర్యతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పారు. విచారణకు ఎందుకు పిలిచారు అనేది తెలియదన్నారు. ఈడీ అధికారుల తీరు ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. కోర్టులు మందలించినా వారిలో మార్పు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మగా ఈడీ పనిచేస్తుందని అనిపిస్తుందన్నారు. ఐశ్వర్యగౌడతో ఎలాంటి వ్యవహారాలు లేవు, 3–4 సార్లు తన ఆఫీసులో కలిసిందని, నా నియోజకవర్గానికి చెందిన వారనే కారణంతో వివిధ కార్యక్రమాలకు వెళ్లానని, అంతకు మించి ఏమీలేదని చెప్పానన్నారు. ఓ నటుడు తన వాయిస్‌తో వంచన చేశాడనే దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు.

రూ.3.98 కోట్ల ఆస్తులు జప్తు
ఐశ్వర్యగౌడ వంచన కేసుల్లో ఈడీ అధికారులు రూ.3.98 కోట్ల విలువచేసే ఆస్తిని జప్తుచేశారు. సోమవారం ఎక్స్‌లో ఈ విషయం తెలిపారు. రూ.2.01 కోట్ల విలువచేసే భూమి, ప్లాట్లు, రూ.1.97 కోట్ల నగదు, వాహనరూపంలో ఆస్తులను తాత్కాలికంగా జప్తుచేశామని తెలిపారు. ఐశ్వర్యగౌడ అధిక ఆదాయం హామీ ఇచ్చి పలువురు వ్యక్తుల నుంచి బంగారం, నగదును వసూలు చేసిందని ఆరోపణలున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement