
మామిడి, టమాటా రైతుల ధర్నా
● సర్కారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
కోలారు: ధరలు తగ్గి తీవ్ర సంకష్టాలను ఎదుర్కొంటున్న మామిడి, టమాటా రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు, రైతులు ఆదివారం తాలూకాలోని రోజర్పల్లి క్రాస్ వద్ద మామిడి కాయలను రోడ్డుపై పోసి ప్రతిఘటన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ.. ప్రభుత్వం 24 గంటలలోగా మామిడి, టమాటాలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులకు పైబడి మామిడి రైతులు గిట్టుబాటు ధర కావాలని ధర్నాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపించారు. మద్దతు ధర ప్రకటించకుంటే బెంగుళూరుకు వెళ్లే జాతీయ రహదారులను బంద్ చేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
జిల్లా ఇన్చార్జి మంత్రిపై ధ్వజం
జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా మామిడి రైతుల కష్టాలకు స్పందించడం లేదన్నారు. కెడిపి సభలకు ఇన్చార్జి మంత్రి వస్తే నల్ల జెండాలతో నిరసనలు తెలుపుతామన్నారు. బంగవాది నాగరాజగౌడ, తేర్నహళ్లి అంజినప్ప, ఈకంబళ్లి మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు.