
నెహ్రూ ఆధునిక భారతదేశ నిర్మాత
శివాజీనగర: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాత అని సీఎం సిద్దరామయ్య అన్నారు. నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం విధానసౌధ తూర్పు ద్వారం వద్ద ఆయన విగ్రహానికి, ఫొటోకు సీఎం పుష్పమాల సమర్పించారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు నిబద్ధతతో పనిచేశారన్నారు. మిశ్రమ ఆర్థికత వ్యవవస్థను ప్రవేశపెట్టి అభివృద్ధికి పునాదాలు వేశారన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న 17 సంవత్సరాల కాలావధిలో అనేక ఆనకట్టలు, ప్రభుత్వ రంగాల పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు.
బీజేపీకి తెలిసింది హింస, అబద్ధం
బీజేపీకి తెలిసింది కేవలం హింస, అబద్ధం మాత్రమేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. కేపీసీసీ కార్యాలయంలో జరిగిన జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితులు, శూద్రులపై కేసులు పెట్టటమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని. ఆ తరువాత వారిని జైలు నుంచి పిలుచుకొని వచ్చేది కూడా వారే. ఇదే నాటకం చేస్తూ వారు కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
అబద్ధాల సృష్టికర్తలు బీజేపీ, ఆరెస్సెస్
సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉన్న అంబేడ్కర్, నెహ్రూ గురించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అబద్ధాలను సృష్టించాయన్నారు. అంబేడ్కర్ను ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది డాంగే, సావర్కర్ అని స్వయంగా అంబేడ్కర్ తన చేతి రాతలో లేఖ రాశారు. అయినా అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ కారణమని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని దుయ్యబట్టారు. డీసీఎం డీ.కే.శివకుమార్, కాంగ్రెస్ నాయకులు బీ.కే.హరిప్రసాద్, హెచ్.ఎం.రేవణ్ణ, డాక్టర్ జీ.సీ.చంద్రశేఖర్, మంజునాథ్ భండారి, ఎం.ఉదయ శంకర్, ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ, ఎమ్మెల్సీ నజీర్ అహ్మద్, జిల్లాధ్యక్షుడు నంజయ్యనమఠ పాల్గొన్నారు.
సీఎం సిద్దరామయ్య