
ద్రౌపదాంబకు విశేష పూజలు
మాలూరు: తాలూకాలోని లక్కూరు ఫిర్కాపుర గ్రామంలో శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదాంబ దేవి ఆలయ కరగ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని అలంకరించి పూజలను నిర్వహించారు. వేద మంత్ర పారాయణం గావించారు. లక్కూరు ఫిర్కాతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
మాజీ డీజీపీ హత్య కేసులో మరిన్ని సంగతులు
బనశంకరి: ఇటీవల బెంగళూరులో నివాసంలో హత్యకు గురైన విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ కేసు సీసీబీ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య పల్లవిని విచారించారు. తన భర్త కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, కూతురు కృతికకు పెళ్లి చేద్దామనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఎప్పుడూ ఆయన సోదరి కుటుంబం అంటే అభిమానం చూపేవారు. ఇంట్లో సమస్య వస్తే సోదరికి ఇంటికి వెళ్లియేవారు. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారు. కుమార్తె చేతి ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడు కాదు. పూర్తి డబ్బు వ్యవహారం ఓంప్రకాష్ చూసుకునేవాడు అని భార్య చెప్పినట్లు తెలిసింది. గతంలో భర్తతో గొడవపడిన పల్లవి ఇల్లు వదిలి వెళ్లేవారు. కుటుంబ కలహాలతో ఓంప్రకాష్ తనను హత్య చేయవచ్చునని పల్లవి భావించింది. హత్యకు గురయ్యే కంటే భర్త ను అంతమొందించాలని నిర్ణయించింది. ఈ కారణాలతో పల్లవి ఓంప్రకాష్ ను హత్యచేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.
డివైడర్కు కారు ఢీ,
మహిళ మృతి
కోలారు: కారు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం చెందింది. కోలారు జిల్లా మాలూరు తాలూకా ఆనేపుర గ్రామం వద్ద చైన్నె – బెంగుళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. కేజీఎఫ్కు చెందిన పుష్పలత (70), తనయుడు మంజునాథ్ బెంగుళూరు నుంచి కేజీఎఫ్కు కారులో వస్తున్నారు. అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొని ధ్వంసమైంది. పుష్పలత గాయాలతో మరణించగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాలూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.
పెద్ద పులి మృత్యువాత
మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని సాగరోళెలోని మద్దనహళ్లి అడవిలో పులి కళేబరం కనిపించింది. వారం క్రితం ఈ ప్రాంతంలోని అడవిలో వెంకటేష్ అనే వ్యక్తికి చెందిన ఆవును పులి చంపేసింది. ఇప్పుడు పులి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పులి కళేబరం దగ్గర రక్తంతో కలిసిన పులి మలం కనిపించింది., పులి కూడా తీవ్రంగా గాయపడిన స్థితిలో కనిపించింది. అటవీ అధికారులు పి.ఏ.నీమా, ఎ.పి సుబ్రమణి పరిశీలించారు. పశు వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. ఫలితాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అమ్మవార్ల ఊరేగింపు
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళిలోని మంగమ్మనపాళ్య వార్డులో మహాగణపతి, సుబ్రమణ్యం స్వామి, కామాక్షీదేవి, ఓంశక్తి అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవం, గ్రామదేవతల ఊరేగింపు ఘనంగా జరిగాయి. విశేష పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవార్లను ఊరేగించారు. భక్తులు కలశాలను ఎత్తుకుని పాల్గొన్నారు.

ద్రౌపదాంబకు విశేష పూజలు

ద్రౌపదాంబకు విశేష పూజలు

ద్రౌపదాంబకు విశేష పూజలు