
టెన్త్ క్లాస్.. బామ్మ పాస్
శివమొగ్గ: రిటైర్మెంటు వయసు కూడా ముగిశాక ఎవరైనా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళికి చెందిన మహిళ ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసి పాస్ అయ్యింది. ఆమె చదువుల మక్కువ అందరినీ సంభ్రమపరచింది. ఈ ఘనతను సాధించింది ప్రమీళా నాయక్ (63), ఆమె ప్రైవేటుగా టెన్త్ క్లాస్ చదివి, ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షలను రాసింది. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో ఉత్తీర్ణురాలైంది. దీంతో ప్రమీళ ఆనందానికి అవధుల్లేవు. పెళ్లి చేసుకోవడంతో టెన్త్ చదవలేకపోయానని చెప్పింది. సంసారంలో మునిగి ఇప్పటివరకు చదువు గురించి పట్టించుకోలేదు, ఆమె భర్త బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. వారి ప్రోత్సాహంతో ఎస్ఎస్ఎల్సీని పూర్తి చేసినట్లు చెప్పింది.
ఉగ్రవాదులను ఏరివేయాలి
మైసూరు: కశ్మీర్లో పహాల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులు, హిందువుల పైన దాడి చేసి హత్యలు చేయడాన్ని ఖండిస్తు కేఆర్నగర పట్టణంలో హిందూ జన జాగృతి కార్యకర్తలు కాగడలతో ఊరేగింపు నిర్వహించారు. ఇంకా వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. కాషాయ ధ్వజాలు, కాగడాలతో ర్యాలీ జరిపారు. పాక్ ఉగ్రవాదులను తుదముట్టించాలని నినాదాలు చేశారు.
బీదర్లో దోపిడీ దొంగపై కాల్పులు
దొడ్డబళ్లాపురం: బీదర్ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఇటీవల జరిగిన దోపిడీ కేసులో ఒక దొంగపై పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారు. వివరాలు.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పరళికి చెందిన కతార్ సింగ్, బీదర్ నివాసి జగదీత్ సింగ్, పుణెకు చెందిన అక్షయ్ అరైస్టెన నిందితులు. ఏప్రిల్ 26న బీదర్ పట్టణంలోని ఆదర్శ కాలనీలో నివసిస్తున్న డీఎల్ఆర్ సూపరింటెండెంట్ జ్యోతిలత ఇంట్లోకి జొరబడ్డ నిందితులు కత్తులతో బెదిరించి రూ.15 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్షయ్ అనే నిందితున్ని అరెస్టు చేశారు, అతడు ఇచ్చిన సమాచారం మేరకు బీదర్ తాలూకా హొన్నికేరి క్రాస్ వద్ద తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయడానికి వెళ్లారు. కతార్ సింగ్ అనే దొంగ హెడ్ కానిస్టేబుల్ మక్సూద్ పై కత్తితో దాడి చేసాడు. దీంతో సీఐ బిరాదార్ కాల్పులు జరపడంతో కతార్ సింగ్ కాలికి గాయాలయ్యాయి. అతన్ని, మక్సూద్ని ఆస్పత్రికి తరలించారు. జగజీత్ సింగ్ను అరెస్టు చేసారు. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు.

టెన్త్ క్లాస్.. బామ్మ పాస్

టెన్త్ క్లాస్.. బామ్మ పాస్