
ఇంట్లోకి చొరబడి రౌడీషీటర్ హత్య
హుబ్లీ: హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చిన రౌడీషీటర్ను అతడి ఇంట్లోకి చొరబడి ప్రత్యర్థులు చాకులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన ధార్వాడ తాలూకా కొట్టూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శంకరయ్య పంచయ్య మఠపతి అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు. రాత్రి శంకరయ్య ఇంటి ముందు కట్టపై కూర్చుండగా బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి శంకరయ్య ఇంట్లోకి పరుగెత్తగా, దుండగులు కూడా ఇంట్లోకి చొరబడి ఉన్నఫళంగా అతనిపై దాడి చేశారు.
ప్రతిఘటించినా దక్కని ఫలితం
దీనిపై శంకరయ్య తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. ఇష్టానుసారంగా చాకులతో పొడిచి పరారయ్యారు. తక్షణమే కుటుంబ సభ్యులు శంకరయ్యను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే 9కి పైగా కత్తిపోట్లు తగిలిన నేపథ్యంలో తీవ్రంగా రక్తస్రావమై మార్గమధ్యంలోనే శంకరయ్య మృతి చెందాడు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల్ బ్యాకోడ్, గ్రామీణ సీఐ సమీర్ ముల్లా చేరుకుని పరిశీలించారు. హత్య చేసిన దృశ్యాలు సదరు ఇంట్లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు వాటి ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.
అసభ్య సందేశం పంపిన మహిళపై కేసు
నేకార నగర్లో ఓ మహిళ కేశ్వాపుర మహిళకు అసభ్యంగా ఫోన్ సందేశం పంపించి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటనపై కసబాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దారూఢ మఠం నుంచి కేశ్వాపురకు ఆటోలో వెళుతూ అదే ప్రాంతానికి చెందిన మహిళకు పరిచయం అయిన నేకార నగర్ మహిళ మాటలతో పరిచయం చేసుకొని సదరు మహిళ ఫోన్ నెంబర్ తీసుకుంది. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించిన ఆమె వాట్సాప్లో అసభ్య సందేశం పంపించింది. అలాగే కొందరు పురుషులకు ఆమె నెంబర్ ఇచ్చి అవమానం చేయడంతో పాటు ప్రాణాలు తీస్తానంటూ బెదిరించిందని బాధిత మహిళ కసబాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాకులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు
పాతకక్షలతోనే హత్యగా అనుమానం