
మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేడ్కర్
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి
సాక్షి,బళ్లారి: భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా ఆదివారం నగరంలోని హొసపేటె రోడ్డులోని అంబేడ్కర్ భవన్ ఆవరణలోని అంబేడ్కర్ ప్రతిమకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. పేద కుటుంబంలో జన్మించిన అంబేడ్కర్ ఎంతో కష్టపడి అత్యున్నత విద్యాభ్యాసం చేసిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశారన్నారు. న్యాయవాదిగా పని చేశారన్నారు. దేశ విదేశాల్లో తన ప్రతిభ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. అంబేడ్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, శక్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సమానత్వం కోసం పాటుపడ్డారన్నారు. దళితులను ఆలయాల్లోకి ప్రవేశించడానికి ఎంతో కృషి చేశారన్నారు. చదువును అవపోసన పట్టారన్నారు. ఎన్నో డిగ్రీలు సంపాదించుకుని, నిస్వార్థంగా దేశానికి సేవ చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో మనందరం నడుస్తూ దేశ సర్వతోముఖాభివృద్దికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, గోవిందరాజులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.