
రైతులకు రుణాలు అందిస్తున్న దృశ్యం
కేజీఎఫ్ : రైతులు సదృఢంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే రూపా శశిధర్ తెలిపారు. మంగళవారం పారాండహళ్లిలో వ్యవసాయ సేవా సహకార సంఘం నుంచి రైతులకు రూ.90 లక్షల వడ్డీ లేని రుణాలను అందించి ఆమె మాట్లాడారు. వ్యవసాయ అవసరాల కోసం అందిస్తున్న వడ్డీ లేని రుణాలను తీసుకున్న రైతులు వాటిని ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రైతుల పాత్ర మహత్తరమన్నారు. తాలూకాలో ఇంతవరకు వేయి మంది రైతులకు రుణాలు అందించామన్నారు. ఈ సందర్భంగా ఏపీఎంసీ అధ్యక్షుడు విజయరాఘవ రెడ్డి, రాధాకృష్ణరెడ్డి, రాంపురం నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.
టికెట్ ఇవ్వకపోతే పోటీ పెడతాం
కోలారు : కోలారు నుంచి కాంగ్రెస్ టికెట్ను మైనార్టీ అభ్యర్థికి కేటాయించకపోతే ఐఎంపీ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపుతామని ఇండియన్ మూమెంట్ పార్టీ(ఐఎంపీ) జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ తెలిపారు. మంగళవారం నగరంలోని పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అహింద నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య అహింద సముదాయం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి అవకాశాలు ఉన్నా మైనార్టీల అవకాశాలను లాక్కోవడం సరికాదన్నారు. కోలారులో మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నందున కాంగ్రెస్ టికెట్ను మైనారిటీ అభ్యర్థికే కేటాయించాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోలారు నుంచి మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుంటే ఐఎంపీ అభ్యర్థిని పోటీ చేయడం తథ్యమన్నారు. దళిత సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహదేవ్ బూదగవి, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి నరగుంద, రాష్ట్ర కార్యదర్శి గోపి బళ్లారి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అబ్దుల్ సుభాన్