భగ్నప్రేమికుడి లవ్స్టోరీలో కొత్త ట్విస్ట్
బెంగళూరు(కర్ణాటక): ప్రేమించిన యువతిని పెళ్లి పీటలపై చూసి భగ్నప్రేమికుడు గొంతు కోసుకున్న ఘటనలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. ప్రియురాలి బంధువులే గొంతు కోసినట్టు తేలింది. 16వ తేదీన దొడ్డ తాలూకా ఘాటి సుబ్రమణ్య పుణ్యక్షేత్రంలోని కళ్యాణ మండపంలో తను ప్రేమించిన యువతి వివాహం జరుగుతోందని బెంగళూరుకు చెందిన నితీష్ అనే యువకుడు పెళ్లిమండపానికి వచ్చి గొడవ చేసాడు. దీంతో నితీష్ను బయటకు తీసుకువచ్చిన పెళ్లికూతురి బంధువులు చితకబాదారు.
దీంతో నితీష్ ఆత్మహత్య చేసుకుంటానని జేబులోంచి బ్లేడ్ తీసి బెదిరించడంతో బంధువులే నితీష్ గొంతు కోసి అక్కడే వదిలి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న నితీ ష్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివాహం నిలిపివేయడం జరిగింది. అయితే మొదట నితీష్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు అందరూ భావించారు. ఆస్పత్రిలో కోలుకున్న నితీష్ పోలీసుల విచారణలో నిజం చెప్పాడు. యువతి తరఫు బంధువులు ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసారు.
చదవండి: సినిమా రేంజ్ క్రైమ్ స్టోరీ.. భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. ఆ తర్వాత..