జెండాలు చేత పట్టుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలను జయంతోత్సవ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా జరుగుతున్న సభలో జెండాలు, కండువాలు వద్దని సూచించారు. ఏబీవీపీ నేతలు వినకపోవడంతో సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు వారికి కిందకు దింపారు. దీంతో అరగంట పాటు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లపై, విద్యార్థులపై అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేస్తూ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను వేధించడం తక్షణమే మానుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంజం వెంకటస్వామి డిమాండ్ చేశారు. దళిత నాయకులు కొరివి వేణుగోపాల్, సత్యరాజ్వర్మ, బొత్త వెంకటమల్లయ్య, సొల్లు అజయ్వర్మ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్టౌన్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు సమష్టిగా కృషి చేద్దామని చొప్పదండి ఎమ్మెల్యే, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్ రాహుల్, డీసీసీ అర్బన్ అధ్యక్షుడు అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఆర్డీవో మహేశ్వర్, ఉన్నత అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎలుక ఆంజనేయులు, సుద్దాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను అంబేడ్కర్ మాదిరిగా ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. దళిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అంబేడ్కర్ చెప్పిన మాటలు ఎడ్యుకేట్– ఆర్గనైజ్ నిరంతరం గుర్తుంచుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. బలహీనవర్గాల అభివృద్ధికి చదువే మూలమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు పేర్కొన్నారు.


