● గ్రానైట్, మట్టి, ఇసుక రవాణా, బెల్టుషాపులపై నిఘా ● దూకుడు పెంచిన ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలో అక్రమ దందాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఓ వైపు గ్రానైట్, మట్టి, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తూనే బెల్టు షాపులపైనా ట్రైనీ ఐపీఎస్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సోహం సునీల్ ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లను పక్కకు పెడుతూ తనదైన శైలిలో నేరాల కట్టడికి కృషి చేస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, ఆయన కదలికలు తెలియకుండా చేపడుతున్న ఈ తనిఖీల్లో గ్రానైట్, మట్టి, ఇసుక అక్రమ దందాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ మానేరు వాగు నుంచి రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. వాగు నుంచి తీసుకొచ్చి ఎలగందుల, ఖాజీపూర్ శివారులో డంప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ దాడులు నిర్వహించగా ఇసుక ట్రాక్టర్ పట్టుపడింది. కొత్తపల్లి, మల్కాపూర్, బావుపేట గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో తనిఖీలు చేపట్టి రూ.50,270 విలువ చేసే 88.270 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.


