జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దొంగలు సోమవారం రాత్రి చోరీకి పాల్ప డ్డారు. గ్రామానికి చెందిన గాండ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి ఉపాధి నిమిత్తం ముంబయ్ వెళ్లాడు. దొంగలు చొరబడి పావుతులం బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
మత్తు మందు చల్లి బంగారం చోరీ
జమ్మికుంట: మాటమాట కలిపి.. మత్తు మందు చల్లి రెండు తులాల బంగారం చోరీ చేసిన ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మడిపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రమ పిండిగిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని వచ్చి, పిండి పడుతారా అంటూ మాట కలిపి ముఖంపై మత్తుమందు స్ప్రే చేశాడు. స్పృహ కోల్పోగానే మెడలోని రెండు తులాల పుస్తెలతాడు చోరీ చేసి పారిపోయాడు. రమ స్పృహలోకి వచ్చి లబోదిబోమంటూ బోరున విలపించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ తెలిపారు.
కారు ఢీకొని ఒకరి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్– మోరపల్లి గ్రామాల మధ్య జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు గాడిపల్లి లక్ష్మణ్ (40) మృతిచెందాడు. రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన లక్ష్మణ్ ద్విచక్ర వాహనంపై చల్గల్ నుంచి సింగరావుపేటకు వెళ్తున్నాడు. కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి లక్ష్మణ్ బైక్ను ఢీకొనడంతో కిందపడిపోయిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ రైతు..
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి చెందిన రైతు వేల్పుల ఐలయ్య(65) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 20న ఐలయ్య తాను సాగు చేసిన కూరగాయాలను కరీంనగర్ మార్కెట్కు తరలించాడు. తిరిగి టీవీఎస్ ఎక్సెల్పై నల్లగుంటపల్లికి వెళ్తున్నాడు. దుర్శేడ్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


