
సాగునీటి సరఫరాపై వీడిన ఉత్కంఠ
రామగుండం: మృగశిర కార్తె ఆరంభం నుంచే వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతోపాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలు హైదరాబాద్ మెట్రో పాలిటిన్ వాటర్ సప్లయ్, సీవరేజీ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) అధికారులకు టెన్షన్ లేకుండా చేశాయి. అప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో హైదరాబాద్కు తాగునీటి సరఫరా చేసే నిర్దేశిత నిల్వలకు 1.5 టీఎంసీలు ఎక్కువగానే ఉండడం అధికారులకు ఊరటనిచ్చింది. గతేడాది నీటి పంపిణీ వ్యవస్థలో నీటి పారుదలశాఖ అధికారుల అంచనాలు తారుమారవడంతో హెచ్ఎండబ్ల్యూఎస్కు తిప్పలు తప్పలేదు. గతేడాది పరిస్థితిని ముందే గుర్తించి అధికార యంత్రాంగం.. ఇప్పుడు అన్ని విధాలుగా సిద్ధమైంది. ఏదేమైనప్పటికీ ఆదివారం రాత్రి నుంచి వాతావరణంలో మార్పు రావడం, ప్రాజెక్టులోకి వస్తున్న ఇన్ఫ్లోతో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుండడం ఆశాజనకంగా ఉంది.
నీటిమట్టం 138.3 మీటర్లకు పడిపోతేనే తిప్పలు..
ఆరు విద్యుత్ మోటార్లతో ప్రతీరోజు 56 క్యూసెక్కులు (0.03 టీఎంసీ) నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు పంపింగ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా 138.3 మీటర్లకు పడిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్ పంపుహౌస్ మోటార్లకు నీరందకపోవడంతో పంపింగ్ నిలిచిపోతుంది. నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం తెలిపిన ఎల్లంపల్లి నీటి మట్టం వివరాలను పరిశీలిస్తే.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 143.47 మీటర్లు, 8.68 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదేరోజు 139.68 మీటర్ల నీటిమట్టం ఉండగా, 4.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటి మట్టం