
‘ఎన్రైప్’తో మామిడి ‘పండు’
● కాయలను పండుగా మార్చే పౌడర్
● మామిడి మార్కెట్లో చైనా పౌడర్లు వాడుతున్నట్లు ప్రచారం
● కాల్షియం కార్బైడ్ను నిషేధించిన ప్రభుత్వం
● ఎన్రైప్ పౌడర్ విక్రయాలకు సర్కార్ అనుమతి
జగిత్యాలఅగ్రికల్చర్: మామిడికాయలను పండుగా మార్చేందుకు చాలా చోట్ల వ్యాపారులు విషపూరితమైన కాల్షియం కార్బైడ్, చైనాపౌడర్లను వాడుతున్నారు. ఇటీవల జగిత్యాల (చల్గల్) మామిడి మా ర్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించే కాయల్లో కాల్షియం కార్బైడ్ కలిగిన చైనాపౌడర్లు వాడుతున్న ట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి పండ్లను తింటున్న వినియోగదారులు క్యాన్సర్ బారిన పడుతుండడంతో ఆరోగ్య సంస్థ, హైకోర్టు కాయను పండుగా మార్చే రసాయనాలను నిషేధించింది. దీంతో కా యను పండుగా మార్చేందుకు ఎన్రైప్ అనే సేంద్రియ పౌడర్ను ఉపయోగిస్తున్నారు. ఎన్రైప్ను ఉపయోగించాలని ఉద్యాన శాఖ ప్రచారం చేస్తుండగా, ఆగ్రోస్ సంస్థ ఆ పౌడర్ను మార్కెటింగ్ చేస్తుంది.
పండ్లలో రారాజు..
పండ్లలో రారాజు మామిడిలో అన్ని రకాల పోషకాలు ఉండడంతో ప్రతి ఒక్కరూ తినేందుకు ఇష్టపడుతుంటారు. గతంలో పక్వానికి వచ్చిన కాయలను గడ్డి, మామిడి ఆకు కింద మాగబెట్టేవారు. అప్పుడు మామిడిపండ్లు రుచిగా, నాణ్యతగా ఉండేవి. కాగా, మార్కెట్లో డిమాండ్ను బట్టి వ్యాపారులు రసాయనాలతో పండుగా మార్చడం మొదలుపెట్టారు. దీంతో మామిడి పండుతో లాభం కంటే నష్టం ఎక్కువగా జరగడంతో ప్రభుత్వం రసాయనాలను నిషేధించింది.
అట్టపెట్టెల్లో చైనా ప్యాకెట్లు
చల్గల్ మామిడి మార్కెట్ నుంచి పంజాబ్, హరియాణా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎక్కువగా మామిడికాయలు ఎగుమతి చేస్తారు. జగిత్యాల నుంచి ఢిల్లీ వెళ్లాలంటే లారీకి రెండురోజులు పడుతోంది. సదరు కాయలను అక్కడి వ్యాపారులు పండుగా మార్చాలంటే మరో నాలుగైదు రోజులు పడుతోంది. దీంతో వ్యాపారులు త్వరగా మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాలకు పంపే మామిడికాయల అట్టపెట్టెల్లో చైనాపొడి ప్యాకెట్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. కాయను పండుగా మార్చే పౌడర్లను ప్రభుత్వం నిషేధించింది. దీనికి తోడు, చాలా మంది పక్వానికి రాని కాయలను విక్రయిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు, ఢిల్లీ వెళ్లేవరకు కాయ నాణ్యత చెడిపోతుండడంతో వాటికి సైతం పౌడర్లు వాడుతున్నారు.
ఎన్రైప్కు ప్రభుత్వ అనుమతి
సహజ సిద్ధమైన స్టార్స్(గంజి)లో ఉండే ఇథలిన్, మాడ్చిన కొబ్బరిచిప్పల పొడితో ‘ఎన్రైప్’ పౌడర్ను తయారు చేస్తారు. ఈ పౌడర్తో కాయ పండుగా మారినా రుచి, నాణ్యతలో తేడా ఉండదు. ఈ మేరకు బెంగళూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ సంస్థ ఆమోద ముద్ర వేయగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వగా, తెలంగాణలో ఎన్రైప్ను అమ్మేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పండుగా ఎలా మార్చుతుందంటే..
ఎన్రైప్ ప్యాకెట్ రూ.పదికి మార్కెట్లో దొరుకుతోంది. ఒక ప్యాకెట్ ద్వారా 10–15 కిలోల మామిడికాయలను పండుగా మార్చవచ్చు. పక్వానికి వచ్చిన కాయలను అట్టపెట్టెలో పెట్టి అందులో నాలుగైదు చోట్ల చిన్నరంధ్రాలు చేసిన ఎన్రైప్ ప్యాకెట్ను వేసి గాలి తగలకుండా సీల్ చేయాలి. ఎన్రైప్ ద్వారా నాలుగైదు రోజుల పాటు అవసరమైన ఇథలిన్ గ్యాస్ విడుదలై కాయ పండుగా మార్చుతుంది.
తనిఖీలు నిర్వహించాలి
మామిడి మార్కెట్తో పాటు రోడ్డు వెంట ఉన్న షెడ్లు, మామిడి విక్రయాలు చేసే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి. కాల్షియం కార్బైడ్, చైనాపౌడర్లు వాడటంపై స్పష్టమైన నిబంధనలు పాటించాలి. ఆరోగ్యం కోసం తినే మామిడిపండు మనిషి అనారోగ్యానికి గురయ్యేలా తయారయితే ఏం లాభం.
– సత్యనారాయణరెడ్డి, ధర్మపురి
ప్రభుత్వ అనుమతితోనే ఎన్రైప్..
ప్రభుత్వ అనుమతితోనే ఎన్రైప్ విక్రయాలు జరుగుతున్నాయి. అగ్రోస్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. మామిడికాయను ఎన్రైప్తో పండుగా మార్చవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కాల్షియం కార్బైడ్, చైనాపొడిని ప్రభుత్వం నిషేధించింది.
– శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖాధికారి, జగిత్యాల

‘ఎన్రైప్’తో మామిడి ‘పండు’

‘ఎన్రైప్’తో మామిడి ‘పండు’

‘ఎన్రైప్’తో మామిడి ‘పండు’