
ఖోఖో పోటీలో తలపడుతున్న క్రీడాకారిణులు
● మూడేళ్ల తర్వాత పాఠశాలల్లో
క్రీడా సందడి
● పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్న విద్యార్థులు
● బాల బాలికల్లో నూతనోత్తేజం
విజయం మాదే..
మేము అల్గునూర్లోని గురుకుల పాఠశాలలో చదువుతున్నాం. క్రీడా పోటీల్లో పాల్గొనాలంటే మాకు చాలా ఇష్టం. మేం లాంగ్ డిస్టన్స్లో పాల్గొంటాం. మండల, జిల్లాస్థాయిలో విజయం మాదే. రాష్ట్ర, జాతీయస్థాయిలో విజయం సాధించి పతకంతో తిరిగిరావాలని అనుకుంటున్నాం.
– కీర్తన, అఖిల, తేజస్విని, అల్గునూర్
ఫస్ట్ టైం ఆడుతున్న
స్కూల్ గేమ్స్లో ఫస్ట్ టైమ్ ఆడుతున్న. ఆనందంగా ఉంది. పో టీలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయని అనుకోలే. గ్రౌండ్ మొత్తం ప్లే యర్స్. చాలా మంది బాగా ఆడారు. నేను ఖోఖో, కబడ్డీ ఆడా. 600, 200 మీటర్ల రన్నింగ్లో విజయం సాధించా. – ఎన్.హాసిని,
ప్రభుత్వ పాఠశాల, సప్తగిరికాలనీ
చాలా టీమ్స్ వచ్చాయి
ఫస్ట్ టైమ్ స్కూల్గేమ్స్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. కాంపీటీషన్ కూడా చాలా బాగుంది. చాలా టీమ్స్ వచ్చాయి. నేను ఖోఖో గేమ్లో ఆడా. స్కూల్ గేమ్స్ అంటేనే ఒక సందడిలా ఉంటుంది. ఏటా నిర్వహించాలి.
– మేఘన,
మైనార్టీ–2 బాలికల పాఠశాల, కరీంనగర్
కరీంనగర్స్పోర్ట్స్: చిన్నారుల కబడ్డీ కూత.. జింక పరుగులా కనిపించే ఖోఖో ఆట.. ఎగిరి బంతిని చితక బాదే వాలీబాల్ లాంటి క్రీడల్లో చిన్నారులు తమ సత్తాను ప్రదర్శించుకునేందుకు సుమారు మూడేళ్లు వేచిచూశారు. ఎప్పుడెప్పుడు ఎస్జీఎఫ్ ఆటలు పెడుతారు.. అడేద్దామంటూ ఎదురుచూసిన చిన్నారి విద్యార్థుల కల నెరవేరింది. కరోనా కారణంగా 2019–20లో చివరి సారిగా పాఠశాలల క్రీడా సమాఖ్య అండర్ 14, 17 క్రీడా పోటీలు జరుగగా మళ్లీ 2023–24లో పోటీలు జరుగుతుండడంతో క్రీడాకారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇటీవల జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య మండలాల వారీగా క్రీడా పోటీల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి ఆయా మండలాల్లో క్రీడాపోటీలు ప్రారంభం కాగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై సందడి చేశారు. ఇక మా ప్రాక్టీస్ ఆపమని.. ప్రతి రోజూ సాధన చేస్తామని, భవిష్యత్లో దేశం కోసం ఆడాలన్నదే తమ లక్ష్యంగా అంటున్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న పలువురిని సాక్షి పలకరించగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
భారీ స్పందన
మూడేళ్ల అనంతరం జరుగుతున్న పాఠశాలల అండర్ 14, 17 క్రీడా పోటీలకు భారీ స్పందన వచ్చింది. నగరంలోని సెయింట్జాన్ పాఠశాలలో కరీంనగర్ అర్బన్ జోన్ క్రీడా పోటీలు జరుగగా తొలి రోజు బాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. సుమారు 400 పాఠశాలల ను ంచి వెయ్యి మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా అడిన తీరు ఆశ్చర్యపర్చింది. ఏదేమైనా పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం కావడంతో క్రీడా సందడి నెలకొంది.
సత్తా నిరూపించుకుంటా
కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న. కాంపిటీషన్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశా. రోజూ ప్రాక్టీస్ చేస్తున్న. టాలెంట్ నిరూపించుకునే రోజచ్చింది. 200 మీటర్స్ రన్నింగ్లో ఫస్ట్ వచ్చా. స్టేట్ మీట్లో కూడా చాంపియన్గా నిలవాలని ఉంది.
– కె అంజలి, ప్రాంతీయ క్రీడా పాఠశాల
ఆడుతానని అనుకోలేదు
కరీంనగర్లోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న. 6వ తరగతిలో స్కూల్ గేమ్స్ జరిగాయి. అప్పుడు పోటీల్లో పాల్గొనలేదు. ఇప్పుడు పదో తరగతిలో ఆడుతానని సందేహం ఉండేది. స్కూల్ డేస్లో కబడ్డీలో సత్తా చూపించాలనుకున్నా. కబడ్డీలో నా టాలెంట్ చూపించా. చాలా హ్యపీగా ఉంది.
– దీపిక, కేజీబీవీ, కరీంనగర్
హ్యాపీగా ఉంది
స్కూల్ గేమ్స్లో విన్ కావాలనేది నా కోరిక. 100 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్లలో విన్ అయ్యా. ఫస్ట్ టైమ్ అవుట్ సైడ్ కాంపిటీషన్లో విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్లో దేశానికి 100 మీటర్ల రన్నింగ్లో పతకం సాధించాలని ఉంది.
– టి సిరిచందన,
సెయింట్ జాన్ స్కూల్

స్కూల్ గేమ్స్కు హాజరైన బాలికలు





