బెల్టు దుకాణాలు నిర్వహించొద్దు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు..అన్న నానుడికి అర్థం లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. మద్యం ప్రియుల నుంచి ఒక్కో బాటిల్కు రూ.30 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం దుకాణాలు నిర్వహిస్తుండడంతో గ్రామాల్లో యువత మద్యానికి బానిసవుతున్నారు. ఉదయం మొదలుకొని అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదు.
బెల్ట్ దుకాణాలకు టెండర్లు..
మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో బెల్ట్ దుకాణం నిర్వహించాలంటే వీడీసీల ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా వేలం పాటలు నిర్వహిస్తు పోటాపోటీగా దక్కించుకుంటున్నారు. ఇటీవల అడ్లూర్ ఎల్లారెడ్డిలో బెల్ట్ షాపు నిర్వహించడానికి రూ.3 లక్షలకుపై పైగా వేలం పాడి ఓ వ్యక్తి దక్కించుకున్నారు. అలాగే తిర్మన్పల్లి, వజ్జపల్లి, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి, భూంపల్లి, లింగంపల్లి, మోడెగాం, జనగాం, కుప్రియాల్, ధర్మారావ్పేట్, అమర్లబండ, కల్వరాల్, మర్కల్, ఉత్తునూర్, యాచారం, వజ్జపల్లి తండా, వజ్జపల్లి, తదితర గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియులతో గొడవలకు దిగుతున్నారు. ‘మేం గ్రామానికి డబ్బులు కట్టినం.. మా ఇష్టం ఉన్న రేట్కు అమ్ముకుంటం’ అంటూ మద్యం ప్రియులకు సమాధానాలు ఇవ్వడంతో వారు అవాక్కవుతున్నారు.
ఉదయం 4 గంటల నుంచి పెగ్ సిస్టం..
సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని హోటళ్లలో పెగ్ సిస్టం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. మద్యం ప్రియులు మొదటగా పెగ్ తీసుకున్న తర్వాతనే చాయి తాగుతున్నారు. హోటళ్లలో నిర్వహించే పెగ్ సిస్టం మద్యం విక్రయాల్లో కల్తీ మద్యం సైతం విక్రయిస్తూ ప్రజల అనారోగ్యాలకు కారకులవుతున్నారు. బెల్ట్ దుకాణాల్లో మద్యం ప్రియులకు కాలం చెల్లిన మిక్చర్ ప్యాకిట్లను అంటగడుతున్నారు. ఈ మిక్చర్ను తయారు చేయారు చేయడానికి మిక్చర్ కంపెనీ వారు నకిలీ నూనెలు వాడుతుండటం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. మద్యం అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించి గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విచ్చలవిడిగా విక్రయాలు
ఒక్కో బాటిల్కు రూ.30 నుంచి 50 ఎక్కువగా వసూలు
తాగుడుకు బానిస అవుతున్న యువత
కాలం చెల్లిన మిక్చర్ ప్యాకెట్ల అమ్మకం
మామూళ్ల ‘మత్తు’లో అధికారులు
గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించకూడదు. అలాంటివి ఉంటే వెంటనే దాడులు చేస్తాం. శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అసలే విక్రయించ వద్దు. త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– సంపతి కృష్ణ, ఎకై ్సజ్ సీఐ, కామారెడ్డి


