మద్నూర్(జుక్కల్): సుల్తాన్పేట్లో మత్తడి పోచమ్మ పండుగను శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. పోచమ్మ తల్లి చల్లగా చూడమ్మా... ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండేలా చూడమని వారు కోరుకున్నారు. మహిళలు పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ఆలయం వద్ద భోజనాలు చేశారు. సాయంత్రం రైతులు ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, ఉప సర్పంచ్ బాల్రాజ్, గ్రామస్తులు బస్వంత్రావ్ పటేల్, సుదర్శన్గౌడ్, ధన్రాజ్గౌడ్, హన్మాండ్లు ఉన్నారు.
నయనానందకరం పెద్దమ్మ కల్యాణం
భిక్కనూరు: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం 27వ వార్షికోత్సవాలు నాలుగు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వనదుర్గ ఆలయంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుదుపరి పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణం జరిపించారు. కల్యాణం అనంతరం మహిళలు కట్నకానుకలు సమర్పించుకున్నారు. భారీగా భక్తులు హాజరయ్యారు. మాజీ సర్పంచ్ తున్కి వేణు, వార్డు సభ్యులు సర్గు దీప సందీప్లను ముదిరాజు సంఘం అధ్యక్షుడు బండి రాములు ఆధ్వర్యంలో సత్కరించారు.
పెద్దమ్మ ఆలయంలో పూజలు చేసిన
మాజీ చైర్పర్సన్ దంపతులు
భిక్కనూరు: మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయం 27వ వార్షికోత్సవాల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డితో పాటు ఆయన సతీమణి కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందు ప్రియలు పాల్గొని శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి కట్నకానుకలను సమర్పించుకున్నారు. వారిని మండల ముదిరాజు సంఘం అధ్యక్షుడు బండి రాములు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీటీసీ చంద్రకళ, నాయకులు గంగళ్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.


