కామారెడ్డి టౌన్ :కాలం వేగంగా కదిలిపోవచ్చు.. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు అని నిరూపించారు ఆ పూర్వ విద్యార్థులు. 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపై కలిసిన ఆ స్నేహితుల కళ్లలో వెలకట్టలేని ఆనందం కనిపించింది. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(గంజ్)కు చెందిన 1996–97 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక అమృత గార్డెన్లో సోమవారం నిర్వహించారు. దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి అల్లరి, గురువుల పాఠాలు, కలిసి పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యా రు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాకాయి కవితరాణి, అజీమ్, నరేశ్, గురుప్రసాద్, శ్రీకాంత్, శివశంకర్, అర్షద్, యాదగిరి గౌడ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
యువతలో మార్పు రావాలి
బాన్సువాడ రూరల్: నేటితరం యువతలో మార్పురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రాణుతి అన్నారు. సోమవారం కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో షహీద్ దివస్ పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు చూపిన తెగువ మరువరానిదన్నారు. వారి నుంచి నేటితరం యువత స్ఫూర్తి పొందాలన్నారు. కళాశాల నుంచి దేశాయిపేట్ చౌరస్తా వరకు నిర్వహించిన పాదయాత్రలో విద్యార్థులు, అధ్యాపకులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్రాథోడ్, బాన్సువాడ ఎస్సై తాజుద్దీన్, కృష్ణ, నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


