దోమకొండ: మండలంలోని చింతమాన్పల్లి గ్రామంలో ఆదివారం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు హర్షిని, జాహ్నవిల తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో మొక్కజొన్న కంకులకు ఒలుస్తున్నారు. దీంతో వీరు ఇంటి నుంచి ఆడుకుంటూ తమ తల్లిదండ్రుల వద్దకు వెళుతుండగా, కుక్కలు రోడ్డుపై వెంటపడి వీరిని తీవ్రంగా గాయపర్చాయి. హర్షినికి కంటిపై తీవ్ర గాయాలు కాగా, జాహ్నవికి కాలుపై గాయాలైయ్యాయి. దీనిని గమనించిన వీరి తండ్రి నారం యశ్వంత్ వెంటనే చికిత్స కోసం ముందుగా కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. కాగా చిన్నారులను గాయపర్చిన కుక్కలను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి చంపివేశారు. రోజురోజుకు గ్రామల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


